హైదరాబాద్ : అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు అనేక రంగాల్లో తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రవాస భారతీయుడికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వ్యాపార రంగంలో దూసుకుపోతున్న గతి ఎనలిటిక్స్ వ్యవస్థాపకుడు వంశీ కోరా.. ప్రముఖ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్( EY ) ప్రకటించిన ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్(ఈస్ట్ సెంట్రల్) అవార్డుకు ఎంపికయ్యారు.
సృజనాత్మకత, ఆత్మస్థైర్యంతో వ్యాపారరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మేటి వ్యాపారవేత్తలను ఈవై సంస్థ ప్రతి ఏడాది ఈ అవార్డుతో సత్కరిస్తోంది. వెస్ట్రన్ పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ఈస్ట్ అండ్ సెంట్రల్ ఓహాయో, కెంటకీ రాష్ట్రాల్లోని వ్యాపార ప్రముఖుల్లో అగ్రగాములు ఏటా ఈ అవార్డును దక్కించుకుంటారు. 2022కి గాను ఈ అవార్డు దక్కించుకున్న పది మందిలో వంశీ కోరా ఒకరు.