అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఆటా ఉగాది సాహిత్య సదస్సును ఏప్రిల్ 17 (శనివారం రోజు)న ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటీ అధిపతి శారద సింగిరెడ్డి ఆధ్వర్యంలో జూమ్ యాప్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా సాంస్కృతిక విభాగం ఉపాధిపతి యామిని స్ఫూర్తి మేడూరు ప్రార్థనా గీతాన్ని ఆలపించి ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భువనేశ్ బూజాల తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదస్సుకు కృష్ణవేణి మల్లవజ్ఞల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు.
పంచాంగ శ్రవణం ముగిసిన తర్వాత ‘ఆశావాది- ఉగాది’ అనే అంశంపై గరికపాటి నరసింహారావు అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. అనంతరం ప్రముఖ సినీ గేయ రచయిత వనమాలి.. మారుతున్న కాలంలో సినీ గేయ రచయితల పరిస్థితులు, తెలుగు భాషకు తగ్గుతున్న ప్రాధాన్యత మొదలైన అంశాలతో కూడిన చక్కటి కవిత వినిపించారు. ఆ తర్వాత ‘ఖతర్నాక్ మన్మథ కాస్త జాగ్రత్త’ అంటూ తనదైన హాస్యపు జల్లులతో హాస్య అవధాని శంకర్ నారాయణ కవితలను చదివి వినిపించారు. అనంతరం ప్రముఖ కథా రచయిత ముని సురేష్ పిళ్లై కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మారిన పరిస్థితులను తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి అయినా అంతా బాగుండాలనే అర్థంతో కవితను వినిపించారు. సదస్సులో పాల్గొన్న అతిథులకు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులందరికీ సాహిత్య వేదిక కమిటీ ఉపాధిపతి పవన్ గిర్ల ధన్యవాదాలు తెలిపి సదస్సును ముగించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి