హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. నాడు 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మందితో తెలంగాణ నడిబొడ్డున జల దృశ్యంలో ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్.. నేడు 2021 సెప్టెంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని మహేష్ బిగాల ఆకాంక్షించారు.