హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ విపక్ష సభ్యులతో మీటింగ్లు పెట్టడంపై ఈటల రాజేందర్ పునరాలోచించుకోవాలని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల సూచించారు. గతంలో కోదండరాంకు మద్దతుగా నిలిచి ఆయన్ను నట్టేట ముంచినోళ్లే ఇవాళ ఈటలకు మద్దతుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో #westandwithkodandaram అంటూ ఆకాశానికి ఎత్తారని, అలాంటి వాళ్లతో సమావేశాలు పెట్టిన కోదండరాం పరిస్థితి ఏమైందో.. ఇప్పుడు ఈటల పరిస్థితి కూడా అంతే అని అన్నారు. విపక్షాలకు చెందిన ఎన్నారై మీటింగుల వల్ల ఒరిగేదేమి లేదని మహేశ్ బిగాల అన్నారు.
ప్రస్తుతం ఈటల చేస్తున్న ప్రయాత్నాలు చూస్తుంటే ఎన్నో ఏండ్లుగా ప్రతిపక్షాలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈరోజు ఎన్నారైల మీటింగ్లో పాల్గొనే వాళ్లంతా ప్రతిపక్షాలకు చెందిన వారు మాత్రమే అని, టీఆర్ఎస్ ఎన్నారైలు ఎవరు ఇందులో పాల్గొనడం లేదని మహేశ్ బిగాల స్పష్టం చేశారు.
ఎన్నారైలు మొదట్నుంచి కేసీఆర్ పరిపాలనా, సంక్షేమం చూశారని తెలిపారు. వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ, సమాజహితం ముఖ్యమన్నారు మహేశ్ బిగాల. సబ్బండ వర్గాలకు కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కేసీఆర్ నాయకత్వం పై విశ్వాసం వ్యక్తపరుస్తూ ఎన్నారైలు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈటల వ్యవహారంలో మరీ ముఖ్యంగా యూఎస్ఏ నుంచి మద్దతు తెలుపుతున్న వారంతా ప్రతిపక్షాల సభ్యులేనని మహేష్ బిగాల తెలిపారు. నాడు కోదండరాంకు ద్రోహం చేసిన ఎన్నారై సభ్యులతో మీటింగ్ పెట్టే ముందు ఈటల పునరాలోచించుకోవాలి. అలాంటి వాళ్లతో స్నేహం ఈటలకు ఎప్పటికైనా ముప్పే. కేసీఆర్ నిర్ణయం అందరికీ శిరోధార్యం. ఆయన ఏ పిలుపు ఇచ్చిన తెలంగాణ బాగోగుల గురించే అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకే ముప్పు. తెలంగాణకి నష్టం చేసే ఎవరినైనా క్షమించేది లేదు అని మహేశ్ బిగాల తేల్చిచెప్పారు.