హైదరాబాద్ : దళితుల సాధికారత సాధనకు సీఎం కేసీఆర్ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ఎన్నారైలంతా స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు.
‘‘గత పాలకులు దళితులని ఓటు బ్యాంకులా మాత్రమే చూశారు తప్పా ఎన్నడూ వారి అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో దళితులంతా గౌరవంగా బతికేలా.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. దళితుల సాధికారతకు రూ.1200 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించి, వెంటనే అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. సందర్భం ఏదైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాలి’’ అని అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు.