ఢిల్లీ : తెలుగు భాష అందరికి మరింత చేరువయ్యేలా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. న్యూ ఢిల్లీలో తన అధికారిక భవనంలో అంతర్జాల వేదిక ద్వారా వెంకయ్య నాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంథాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..27 ఏండ్లుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమన్నారు. 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని ప్రశంసించారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం తాను ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నామని, తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు.
ఈ ఆవిష్కరణ మహోత్సవం తర్వాత జూమ్ వేదిక లో జరిగిన “సభా విశేష సంచిక” డయాస్పోరా తెలుగు కథానికి -15, వెనుతిరగని వెన్నెల (డా.కె.గీత) “వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?( డా. చాగంటి కృష్ణకుమారి) గ్రంధాల పరిచయం, 7వ ప్రపంచ సాహితీ సదస్సు జ్ఞాపకాల రవళి కార్యక్రమం రెండు గంటలకి పైగా అంతర్జాలం లో విజయవంతంగా జరిగింది. ఈ వేదికలో ఆ సదస్సు ప్రధాన నిర్వాహకులు, పాల్గొన్న కొందరు వక్తలు, వేదిక నిర్వాహకులు మొదలైన వారు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.