సింగపూర్ : తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో సింగపూర్ నుండి 5వ అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా ఘనంగా నిర్వహించారు. ఐదున్నర గంటలపాటు కొనసాగిన ఈ కార్యక్రమాన్ని వేలాది మంది వీక్షించారు. సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పలు భాగవత పద్యాలు, కీర్తనలు, పద్య కథనాలు వంటి ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగపూర్, ఇండియా నుండే కాకుండా అమెరికా, మలేషియా దేశాల నుండి కూడా పిల్లలు పాల్గొని కార్యక్రమానికి వన్నె తెచ్చారు. చిన్నారులలో మన సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, చిన్నారులు మౌర్య, మనుశ్రీ ఆకునూరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు. రమ్య భాగవతుల, నమ్రత దేవల్ల వారికి సహకారం అందిస్తూ పిల్లలని మరింత అలరించారు.
ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి పలువురు గురువులు పిల్లలకు తమ తమ సంస్థల ద్వారా పాటలను, పద్యాలను నేర్పారు. ముఖ్యంగా ప్రముఖ నేపథ్య గాయకులు నేమాని పార్థసారథి (కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్), షర్మిల (మహతి అకాడమీ), కిడాంబి విక్రమాదిత్య (ముకుందమాల బృందం), విద్య కాపవరపు (విద్య సంగీతం అకాడమీ), అపర్ణ ధార్వాడ తమ విద్యార్థుల ప్రతిభకు గత రెండు నెలలుగా సానపెట్టి ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు తయారు చేసారు. అలాగే, ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, మల్లిక్ పుచ్చా వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు.
ఈ అంతర్జాల భాగవత జయంతి ఉత్సవాలు చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన ఆర్కే వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు భాగవత ప్రచార సమితి తరపున నిర్వాహకులు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు. చివరగా ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి, ముఖ్యంగా నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల, నమ్రత దేవల్ల, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, విద్యాధరి కాపవరపు, చి. మౌర్య ఊలపల్లిలకు మా సంస్థ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.