హైదరాబాద్ : అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని యూఎస్ఏ శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో సంతకాల సేకర ప్రారంభించారు. ఇప్పటి వరకు 130పైగా టీవీ కార్యక్రమాలు నిర్వహించి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26న మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజు చిలువేరు వ్యాఖ్యాతగా జూమ్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరగాయకుడైన ఘంటసాల కోసం 32దేశాల్లోని తెలుగు సంస్థల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి భారత రత్న పురస్కారం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాల గొప్ప జాతిరత్నమని, కళే జీవితంగా భావించి, తన చివరి క్షణం వరుకు తన జీవితాన్ని ఆ కళకే అర్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారత రత్న రావడం ఎంతో సమంజమన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి అనీ, గొప్ప దేశ భక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడని కొనియాడారు. ఇప్పటికైనా ఆయన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలన్నారు. మరో సంగీత దర్శకుడు మల్లికార్జున్ పాల్గొని మాట్లాడారు. భారతదేశం గర్వించదగ్గ మహోన్నత గాయకుడు ఘంటసాల అని కొనియాడారు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి, సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారన్నారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నుంచి ఘంటశాల తనయ ఘంటసాల శ్యామల అతిథిగా పాల్గొని.. చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. భారత రత్న కోసం నిర్వాహకులు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు.