హైదరాబాద్: తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో.. ప్రశాంతత, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సొంతమని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, పీవీ తనయుడు పీవీ ప్రభాకర్రావు అన్నారు. గుండె శస్త్రచికిత్స అనంతరం.. దేశానికి ఏదో చేయడం కోసమే తనకు పునర్జన్మ లభించినట్టుగా పీవీ భావించారని గుర్తుచేశారు. ఒకదశలో రాజకీయాల నుంచి విరమణ పొందాలని భావించారని, అనూహ్య పరిణామాల మధ్య ప్రధాని పదవి చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. యూరప్లోని లాత్వియాలో పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పీవీ ప్రభాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి సంక్షోభాన్ని అధిగమించారని తెలిపారు. అందరినీ కలుపుకుని వెళ్లడం పీవీ పనితీరులో ప్రత్యేకత అని చెప్పారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే మైనారిటి ప్రభుత్వాన్ని ఐదేండ్ల పాటు విజయవంతంగా నడిపిన ఘనత పీవీ సొంతమన్నారు. ఏకాభిప్రాయ సాధన ద్వారా సరికొత్త రాజకీయాలకు పీవీ నాంది పలికారన్నారు.
ఐటీ, టెలికాం, రహదారులు, భారీ ప్రాజెక్టులు సహా వివిధ రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారని పీవీ ప్రభాకర్రావు తెలిపారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థకు బదులుగా సులభతరమైన వాణిజ్య విధానాలు అమలు చేశారని వివరించారు. మారుమూల గ్రామం నుంచి తన మేథాశక్తితో పీవీ అంచెలంచెలుగా విశ్వమానవుడిగా ఎదిగారని తెలిపారు. పీవీ ఘనతను నేటి తరానికి తెలియచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. పీవీ నుంచి స్ఫూర్తి పొందడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. పీవీని అధ్యయనం చేసేందుకు ఉత్సవాలు ఆరంభం మాత్రమే అని తెలిపారు. అద్భుతమైన మేథాశక్తి, స్పందించే హృదయం కలిగి ఉండటం వంటి అరుదైన లక్షణం పీవీ ప్రత్యేకత అని చెప్పారు.
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీపై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ అని శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, తెలంగాణ ఎన్ఆర్ఐ కన్వీనర్ మహేశ్ బిగాల అన్నారు. పీవీ ఖ్యాతిని స్మరించుకోవడం, నేటి తరానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఏడాది పాటు వివిధ దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పీవీ ఘనతపై చర్చించుకున్నామని అన్నారు. పీవీ కేవలం ఆర్థిక సంస్కరణలకు పరిమితం కాలేదని, ఏ రంగంలో బాధ్యత చేపట్టినా వినూత్న నిర్ణయాలు తీసుకునే నిరంతర సంస్కరణశీలి పీవీ అని కొనియాడారు.
జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో నిథిం డైరెక్టర్ డాక్టర్ చిన్నం రెడ్డి, తెలుగు ప్రతినిధులు విజ్ఞాన్, క్రాంతి కుమార్, భాను, అపూర్వ, సుస్మిత, రణధీర్, స్వాతి, వినయ్ బొంతల పాల్గొన్నారు.