తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భారత్కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. ప్రజాప్రతినిధులు జిల్లాలోని ఆయా చోట్ల లబ్ధిదారులకు రేషన్కార్డులను అందించి రూ. 14 కోట్ల విలువైన బియ్యాన్ని సైతం పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుల జారీతో రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల మంది లబ్ధిదారులకు అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది.
గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఈ మధ్యాహ్ననికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు తగ్గింది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు అధికారులు తెలిపారు. 12 గంటల వ్యవధిలో సుమారు 6 అడుగుల మేర నదిలో నీటి ప్రవాహం తగ్గింది.
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు నిరాడంబరంగా కొనసాయి. ఈ ఏడాది కూడా కరోనా నియంత్రణ నిబంధనల కారణంగా సింగపూర్ బోనాల పండుగ వేడుకలు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో ఆదివారం నిరాడంబరంగా జరిగాయి. ఇక్కడి సుంగే కేడుట్లోని అరస కేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనల ప్రకారం బోనాలు సమర్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. మొత్తం ఇక్కడ 50 విడిజన్లు ఉండగా 47 స్థానాల్లో (ఏకగ్రీవంతో కలిపి) వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. 50వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ నూర్జహాన్ బేగం ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యంతో ఆమె గెలుపొంది మరోసారి మేయర్ రేసులో నిలిచారు. మేయర్గా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమెనే ఎంపిక చేసినట్లు తెలిసింది.
శ్రీవారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
కార్గిల్ విజయగాథను దేశంలోని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ఒలింపిక్స్కు భారత్ తరపున ఆడుతున్న ప్లేయర్స్ను అందరూ సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చెయ్యాలని ప్రధాని కోరారు. ఇండియా జోడో ప్రచారాన్ని అమలు చేయాలని, నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అనే మంత్రంతో ముందుకు సాగాలని భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
మయన్మార్లోకి చైనా చొచ్చుకు వస్తున్నదని, దానిపై భారత్ ఓ కన్నేసి పెట్టాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ సూచించారు. ఒక సంస్థ ఏర్పాటు చేసిన వెబినార్లో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో మయన్మార్లో సైనిక తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయ ఆంక్షలు విధించారని చెప్పారు. మయన్మార్లో వేగంగా సాధారణ పరిస్థితులు తీసుకురావడం భారత్కు, ఈ ప్రాంతానికి చాలా అవసరమన్నారు.
నటి, మోడల్ యషికా ఆనంద్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆదివారం తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఢివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో యషికా ఆనంద్కు గాయాలయ్యాయి. ఆమె స్నేహితురాలు వల్లిచట్టి భవానీ (28) మరణించింది.
వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించింది. హంగరీలోని బుడాపెస్ట్లో ఆదివారం జరిగిన 73 కేజీల విభాగం ఫైనల్లో బెలారస్ ప్రత్యర్థి కెనియా పటపోవిచ్పై 5-0 తేడాతో ఆమె గెలిచింది.
కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునఃప్రారంభం కానుంది. తొలిరోజైన సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. నూతన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 10న క్వాలిఫయర్ 1, అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగనున్నాయి. అక్టోబర్ 13న క్వాలిఫయర్ 2 మ్యాచ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
ఇండియన్ స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్లో శుభారంభం చేసింది. మహిళల 51 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ రౌండ్ ఆఫ్ 32లో విజయం సాధించింది. ఆదివారం డొమినికాకు చెందిన హెర్నాండెజ్ గార్సియా మిగులినాతో జరిగిన బౌట్లో 4:1 తేడాతో గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది.