దళిత సాధికారత పథకానికి తెలంగాణ దళితబంధు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతుబీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే కేసీఆర్ ప్రారంభించారు. రైతుబంధు పథకాన్ని సైతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్కు ఇవాళ ఆయన లేఖ రాశారు. ఈ పరీక్షలను కేవలం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లోనే నిర్వహిస్తున్న కారణంగా ప్రాంతీయ భాషల్లో చదివిన ఉద్యోగార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ గతంలో ప్రధాన మోదీకి విజ్ఞప్తి చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత చుట్టు పక్కల కాలనీల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇబ్బంది మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్కు సూచించారు. నూతనంగా సహాయమంత్రిగా నియామకమైన అజయ్ భట్ ఆదివారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యను వెంకయ్య నాయుడు ప్రస్తావించారు.
పోతనమాత్యుడి భాగవత ఆణిముత్యాల ఆలాపనకు సింగపూర్ వేదికైంది. భాగవతం ఆణిముత్యాలు.ఓఆర్జీ వారి ఆధ్వర్యంలో ‘రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ 2021’ సింగపూర్ కార్యక్రమం ఆన్లైన్ వేదికగా అద్బుతంగా జరిగింది. సింగపూర్ వంటి చిన్న దేశం నుంచి కూడా 15 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోతన భాగవతంలోని పద్యాలను నేర్చుకొని పాడి వినిపించడంతో పాటు చక్కటి తెలుగులో ఆ పద్యాల తాత్పర్యాన్ని వర్ణించి పెద్దల ప్రశంసలు అందుకున్నారు.
అవకాశవాద రాజయకీయాలకు పాల్పడ్డ ఈటల రాజేందర్పై ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోదక్ కుమార్ నిప్పులు చెరిగారు. హన్మకొండలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఆశ పడటం సహజమేనని కానీ సీఎం పదవిపై ఈటల అత్యాశ పడ్డారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాలను ఈటల తన స్వార్థానికి వాడుకున్నారని వినోద్ కుమార్ విమర్శించారు.
అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఆదివారం దుండగులు హ్యాక్ చేశారు. ఖాతా పేరు మార్చిన హ్యాకర్లు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ పేరిట మార్చారు. అలాగే ప్రొఫైల్ ఫొటోను సైతం మార్చి ఎలన్ మస్క్ చిత్రాన్ని ఉంచారు. ఈ విషయంపై ఎంఐఎం ట్విట్టర్కు ఫిర్యాదు చేసింది.
సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మహబూబాబాద్ పట్టణం, గూడూరు మండలానికి చెందిన 100 మంది కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భారీగా భక్తులు తరలిరావడంతో క్యూ కాంప్లెక్స్లు కిటకిటలాడాయి.
ఏపీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తున్నదని ఆయన విమర్శించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం పార్లమెంట్ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ సమావేశాల్లో పలు చట్టాలను చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 19న ప్రారంభమయ్యే ఈ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్లో గత 20 ఏళ్లుగా భారత్ నిర్మించిన భవనాలు, మౌలిక వసతులే లక్ష్యంగా దాడి చేయండంటూ అక్కడి తాలిబన్లు, పాకిస్థాన్ ఫైటర్లకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సూచించింది. ఆప్ఘనిస్థాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబన్లకు మద్దతుగా ఇప్పటికే చాలా మంది పాక్ ఫైటర్లు వాళ్లతో చేతులు కలిపారు. వాళ్లందరికీ ఇప్పుడు భారత ఆస్తులే లక్ష్యంగా దాడులు చేయాలన్న ఆదేశాలు అందాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని బేస్బాల్ స్టేడియం వెలుపల దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు మృతిచెందారు.