ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఇవాళ ఆవిష్కరించింది. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. మండపంలో గణనాథుడికి ఎడమ వైపు కాలనాగదేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సారి 40 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
స్వచ్ఛ హైదరాబాద్ దిశగా మరో ముందడుగు పడింది. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జలమండలి ప్రయత్నిస్తోంది. క్రమంలో భాగంగా డయల్ ఏ సెప్టిక్ ట్యాంకర్లను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ వాహనాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 155313కు డయల్ చేయొచ్చు.
దక్షిణాఫ్రికాలోని తెలుగువారంతా క్షేమంగా ఉన్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి అల్లర్లు, దోపిడీలకు దారితీశాయి. ఈ క్రమంలో ప్రవాసుల క్షేమంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గుర్రాల నాగరాజు అక్కడి పరిస్థితిని తెలియజేశారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ పటిష్టానికి కృషి చేయాలని వారికి మంత్రి సూచించారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ టేకులగూడెం గ్రామానికి చెందిన గడ్డం సామెల్ అనే వ్యక్తి ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందాడు. టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే స్వయంగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి అందజేశారు.
సినిమా ప్రియులకు శుభవార్త. గత కొద్ది నెలల నుంచి మూతబడ్డ సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోనున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి కొత్త సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో రేపటి నుంచి థియేటర్లను తెరవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
IISC బెంగళూరు నిర్వహించిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో ఇద్దరు గిరిజన విద్యార్థులు అర్హత సాధించారు. ఒకరు ఐఐటీ ఖరగ్పూర్కు ఎంపిక కాగా, మరొకరు వరంగల్ నిట్కు ఎంపికయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పట్నాపూర్కు చెందిన అక్రె భరత్ (21)కు ఐఐటీ ఖరగ్పూర్లో సీటు లభించింది. మరో విద్యార్థి కుర్సెంగ సురేందర్కు ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్లో వరంగల్ నిట్లో సీటు వచ్చింది.
మెదక్ జిల్లా నారైంగికి చెందిన యువగాయని శర్వాణికి స్టార్ టు రాక్ స్టార్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించానని దేవిశ్రీపసాద్ ట్వీట్ చేశారు. కేటీఆర్ సర్ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. తమిళంలో నిర్వహిస్తున్న ‘స్టార్ టు రాక్ స్టార్’ కార్యక్రమంలో శ్రావణికి అవకాశం ఇచ్చా అని పేర్కొంటూ శర్వాణితో దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్ మీ స్పందన అమోఘం అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. శర్వాణి పాట పాడే వీడియోను కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్యసభకు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడు ఇవాళ సమావేశమయ్యారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమావేశాల్లో ప్రభుత్వం తన శాసన ఎజెండాను కొనసాగించాలని యోచిస్తుండగా.. విపక్షాలు మాత్రం పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ కందహార్లో శుక్రవారం భారత ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతిపై తాలిబాన్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. డానిష్ సిద్దిఖీ మరణంతో మేమెంతో బాధపడుతున్నామని తాలిబాన్ ప్రతినిధి జబీల్లా ముజాహిద్ మీడియాకు చెప్పారు. ‘మాకు సమాచారం ఇవ్వకుండానే పలువురు జర్నలిస్టులు యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతానికి వస్తున్నారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆ జర్నలిస్ట్ ఎవరి కాల్పుల్లో చనిపోయాడో తమకు తెలియదు.’ అని పేర్కొన్నారు.