తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. రమణకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. టీఆర్ఎస్లో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణ చేరికతో తీరిందని పేర్కొన్నారు.
తెలంగాణలో చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిథ్యం కల్పిస్తామని.. ఇందుకు సంబంధించి త్వరలోనే శుభవార్త అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. చేనేతల అభివృద్ధి కోసం చాలా చేశాం.. కానీ సరిపోవడం లేదు.. చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. చేనేతల బాధలను విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఆనాటి ఘోరమైన పరిస్థితుల్లో ఒంటరిగా బయల్దేరి, చిత్తశుద్ధితో మొండిగా ప్రయత్నిస్తే ఇవాళ తెలంగాణ సాధ్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధ్యం కావడమే కాదు అద్భుతాలు ఆవిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీఎం కేసీఆర్ను కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రాన్ని అందుకున్న సీఎం సానుకూలంగా స్పందించారు.
ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో గతంలో 12గా ఉన్న పులుల సంఖ్య తాజా నివేదికలో 14కు చేరింది. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం వార్షిక నివేదికను రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ శుక్రవారం విడుదల చేశారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మొత్తం 14 పులులను, 43 రకాల వన్యప్రాణులు అటవీ అధికారులు గుర్తించారు. పులుల సంఖ్య 2019లో 12గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీంటిని జాబ్ క్యాలెండర్లో చేర్చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 20న జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాపర్ డ్యామ్, తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా లేదా అన్నది తెలుసుకునేందుకు రానున్న 100 రోజులు కీలకమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మన జనాభాకు ఇంకా కరోనా ముప్పు తొలగలేదని, సహజ హెర్డ్ ఇమ్యూనిటీకి మనం ఇంకా చేరలేదని చెప్పారు. అందుకే నిరంతర వ్యాక్సినేషన్పై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది.
ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
మధ్యప్రదేశ్లోని గంజ్ బసోడాలో గురువారం సాయంత్రం ఎనిమిదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. ఆమెను రక్షించే క్రమంలో బావి గోడ కూలడంతో మరో 40 మంది గ్రామస్థులు కూడా అదే బావిలో పడిపోయారు. దీంతో సహాయకచర్యలు చేపట్టిన అధికారులు 23 మందిని రక్షించారు.
జాతీయ ఫిల్మ్ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి సురేఖా సిక్రి ఇవాళ గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 75 ఏళ్లు. ఇటీవల బదాయి హో చిత్రంతో పాటు బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు) లాంటి టీవీ షోల్లోనూ ఆమె నటించారు.
ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో మృతి చెందారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్కు పని చేస్తున్న ఆయన.. గురువారం రాత్రి కాందహార్లో జరిగిన తాలిబన్ల దాడిలో మరణించారు. ఆఫ్ఘన్ స్పెషల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్కడి పరిస్థితిపై ఆయన రిపోర్ట్ చేస్తున్నారు.
టీ 20 వరల్డ్ కప్ గ్రూపులను శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్, పాకిస్థాన్ రెండూ ఒకే గ్రూప్లో ఉన్నాయి. వరల్డ్కప్లో రెండు రౌండ్లుగా మ్యాచ్లు జరగనున్నాయి. తొలి రౌండ్లో గ్రూప్ ఎ, గ్రూప్ బిలోని 8 టీమ్స్ పాల్గొంటాయి. ఇందులో నుంచి నాలుగు టీమ్స్ ప్రధాన రౌండ్కు అర్హత సాధిస్తాయని ఐసీసీ వెల్లడించింది. నిజానికి ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నమెంట్ కరోనా కారణంగా యూఈఏకి తరలించారు. అయితే టోర్నీ హోస్ట్గా ఇండియానే ఉంటుంది.