ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు.
ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైందని, వారికి నైపుణ్యాలు తోడైతే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణలో రాగల మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో సమస్యలు ఎదురైతే.. 100కు లేదా 040-29555500 నంబర్లకు కాల్ చేయాలని హైదరాబాద్ నగరవాసులకు మంత్రి కేటీఆర్ సూచించారు. కాగా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పాత వరద వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీసులు హెచ్చరించారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో వంద మందికి పైగా టీఆర్ఎస్లో చేరారు. కమలాపూర్ మండలం ఉప్పలపల్లి, నెరేళ్ల, శనిగరం గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు పార్టీలో చేరారు. ఇక
టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా విశాఖకు కార్గో సేవలను టీఎస్ ఆర్టీసీ గురువారం ప్రారంభించింది. ఈ కార్గో వాహనాలు పటాన్ చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్, సీబీఎస్ నుంచి అందుబాటులో ఉండనున్నాయి. కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా ఈ వాహనాలు విశాఖకు చేరుకోనున్నాయి.
ఈ నెల 16, 17 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు వెల్లడించారు. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ క్యాంపును నిర్వహించనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు విద్యార్థులకు కరోనా టీకా ఉచితంగా వేయనున్నారు.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగించారు. జూలై 24 వరకు ఇందుకు అవకాశం కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈ నెల 31న డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనున్నట్లు చెప్పారు.
జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం తెలిపారు. విద్యార్థుల డిమాండ్ మేరకు పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్ వేవ్ తొలి దశలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ హెచ్చరించారు. కరోనా వైరస్ నిరంతరం మారుతోందని, మరింత ప్రమాదకర వేరియంట్లు ఉద్భవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైరస్ 111 దేశాల్లో నమోదు అయ్యింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్ తెలిపారు.
బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో.. ఇప్పుడు అలాంటి చట్టాలు అవసరమా అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలైన కేసులో కోర్టు ఈ రకంగా స్పందించింది.
హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణం చేశారు. దత్తాత్రేయ చేత హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవి శంకర్ ఝా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.