హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫుణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతుందని.. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్రషాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశించారు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. నకిరేకల్, కోదాడ, దేవరకొండ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రమావత్ రవీంద్రకుమార్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి కేటీఆర్ చొరవతో మరో కుటుంబానికి అండ దొరికింది. కరీంనగర్కు చెందిన కదాసి అనూష కుమారుడు 17 నెలల విశ్వకు రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. ఈ పరేషన్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చయ్యాయి. దీంతో సాయం అందించాలని బాధిత కుటుంబం కేటీఆర్ను ట్విట్టర్లో అర్థించింది. స్పందించిన కేటీఆర్.. వివరాలు కనుక్కొని కుటుంబానికి సాయం చేయాల్సిందిగా స్థానిక మంత్రి గంగుల కమలాకర్కు సూచించారు. తక్షణమే స్పందించిన గంగుల కమలాకర్.. బాధిత కుటంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేలు అందజేశారు.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 65,607 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 465 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా నలుగురు చనిపోయారు. ఇక ఏపీలో గత 24 గంటల్లో 2,665 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91,677 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,665 పాజిటివ్గా నిర్దారణ అయ్యాయి. కాగా కొవిడ్-19తో తాజా 16 మంది చనిపోయారు.
మధ్యప్రదేశ్లోని బీజావర్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇంట్లోని వాటర్ ట్యాంకర్ను మోటార్ సహాయంతో శుభ్రం చేస్తుండగా ఒకరికి విద్యుత్ తగిలింది. ఇలా ఒకరిని మరొకరు రక్షించేందుకు ప్రయత్నించగా అందరూ విద్యుదాఘాతానికి గురయ్యారు.
నరేంద్ర మోదీ కేబినెట్లోని మొత్తం 78 మంత్రుల్లో 90 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. అలాగే 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) నివేదిక వెల్లడించింది. నలుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు తెలిపింది.
క్షేత్రస్థాయిలో అసాధారణ పనులు చేస్తున్న వ్యక్తులను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో అద్భుతమైన పనులు చేస్తున్న నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నా.. సాధారణంగా వాళ్లు ఎవరికీ తెలియకుండా ఉండిపోతారని ట్విటర్లో మోదీ అన్నారు. సెప్టెంబర్ 15 లోపు http://padmaawards.gov.in లోకి వెళ్లి మీరు ఆ వ్యక్తులను నామినేట్ చేయవచ్చని చెప్పారు.
ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోంది. భూమి వైపు గంటకు 16 లక్షల కి.మీ. వేగంతో దూసుకొస్తున్న ఈ తుఫాను కారణంగా సమాచార వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సూర్యుడి వైపు ఉన్న భూమిపై సబ్-సోలార్ పాయింట్లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ వెల్లడించింది.
భారత్లో కొత్త ఐటీ నిబంధనలు పాటించకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్విట్టర్ మొత్తానికి దిగొచ్చింది. వినయ్ ప్రకాశ్ను ఇండియాలో రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్గా నియమించింది. ఈ గ్రీవియన్స్ ఆఫీసర్తోపాటు చీఫ్ కాంప్లయెన్స్ ఆఫసీర్, నోడల్ ఆఫీసర్ను కూడా నియమించాల్సి ఉంది.