హైదరాబాద్ : హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థికి దేశ విదేశాల నుంచి వివిధ వర్గాల నుంచి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా గెల్లుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ..ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నారైలు హుజురాబాద్లో ఉన్న బంధువులకు, మిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి గెల్లు అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. మంచి మెజారిటీ తో గెలిపించాలని ఆకాంక్షించారు .
గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని తెలిపారు. 2001 నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించాను.
ఈ కార్యక్రమాన్ని అన్ని దేశాల ప్రతినిధులతో నిర్వహించినందుకు అన్ని దేశాల ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందన్నారు. మా ఎన్నారై అన్ని శాఖలు ఈ ఎన్నికల్లో వాళ్లకు సోషల్ మీడియా, టెలిఫోనిక్ కాంపెయిన్, ప్రత్యక్షంగా పాల్గొనడం ఇలా వారికి తోచిన విధంగా సహకరిస్తామన్నారు. కార్యక్రమములో ఎన్నారై ప్రతినిధులు అనిల్ కూర్మాచలంతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు గెల్లుకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.