లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆన్లైన్ ద్వారా ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్నదని అన్నారు. మహిళలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుందని.. ఆత్మ విశ్వాసమే ఆయుధంగా మహిళలు ముందుకు సాగాలన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. మహిళలు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తామని భరోనా ఇచ్చారు.
అనంతరం టాక్ అధ్యక్షురాలు కంది పవిత్ర రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల వివక్ష చూపొద్దని వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహించాలన్నారు. ఎన్నో సంస్థలకు మహిళలు నాయకత్వం వహించి అద్భుత విజయాలు సాధిస్తున్నారని గుర్తుచేశారు. ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ గాయని స్వాతిరెడ్డి పాడిన పాటలు శ్రోతలను అలరించారు. కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, న్యూజిలాండ్ నుంచి బ్రాండ్ తెలంగాణ అంబాసిడర్ సునీత విజయ్, కువైట్ నుంచి నందిని అబాగోని, టాక్ మహిళా విభాగం సభ్యులు జాన్వీ , సుష్మణ, శ్వేతా మహేందర్, ప్రియాంక , మమత , సంధ్య , శోభ, శ్వేత, లక్ష్మి , యూకేలోని ఇతర మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.