హైదరాబాద్ : కొవిడ్ – 19 సమయంలో భారత పౌరులకు అండగా నిలిచేందుకు భారత రాయబార కార్యాలయం ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ (ICSG)ను ఏర్పాటు చేసింది. కువైట్లో తక్కువ ఆదాయం కలిగిన భారత పౌరులు కరోనాతో మృతిచెందితే రూ. లక్ష ఆర్థికసాయం అందజేయనున్నట్లు భారత రాయబారి సిబీ జార్జ్ ఇవాళ రాయబార కార్యాలయంలో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రకటించారు. 120 కువైట్ డాలర్ల కంటే తక్కువ జీతం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. ‘తాజా గణాంకాల ప్రకారం, కువైట్లో 540 మందికి పైగా భారతీయులు కొవిడ్తో మరణించారు. తక్కువ జీతం పొందుతున్న గృహ కార్మికులు 100 మందికిపైగా మరణించారు. రూ. లక్ష ఆర్థిక సాయం కుటుంబానికి పెద్ద మొత్తం కాదని తెలుసు. కానీ కుటుంబ సభ్యులకు కొంతైనా ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతున్నా’ అని రాయబారి సీబీ జార్జ్ అన్నారు. మృతుల చట్టపరమైన వారసుడిని ఎంబసీ గుర్తించి ఆ మొత్తాన్ని అప్పగిస్తుందని రాయబారి తెలిపారు.