హైదరాబాద్ : తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. వంశీ డాక్టర్ సినారె విజ్ఞాన పీఠం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉగాండా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన 107 వ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంలో రమణాచారి మాట్లాడారు.
కాళోజీ పట్ల గౌరవ భావంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం గా నిర్వహిస్తూ స్ఫూర్తిని పంచుతున్నదని తెలిపారు. వంశీ రామరాజు తొలుత స్వాగతం పలుకుతూ కాళోజీ వ్యక్తిగతంగా తన వివాహం దగ్గరుండి జరిపించారని, కవిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
కాళోజీ, సినారె స్ఫూర్తితో యాభై ఏళ్లుగా సాంస్కృతిక సేవతోపాటు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఈ కార్యక్రమానికి అనుసంధానం చేశారు. ఉగాండ తెలుగు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు, ప్రస్తుత అధ్యక్షుడు వెల్దుర్తి పార్థసారధి తమదేశంలో కాళోజీ స్ఫూర్తితో తెలుగు భాషకు తెలుగువారికి సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాలు స్వీకరించిన ప్రముఖ కవులు ఆర్ సీతారాం, డా.అంపశయ్య నవీన్, రామా చంద్రమౌళి ప్రసంగిస్తూ కాళోజీ చెప్పిందే ఆచరించారని, గొప్ప ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. సామాన్యులను సైతం చేరేలా కవిత్వం రాస్తూనే అందులో అరుదైన కవితా శిల్పాన్నిపొదిగారని పేర్కొన్నారు.
కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి ,కార్యదర్శి వి.ఆర్. విద్యార్థి, కాళోజీ కుమారుడు రవికుమార్, ఉగాండకు చెందిన రచయిత వ్యాస కృష్ణ బూరుగుపల్లి తదితరులు ప్రసంగిస్తూ కాళోజీ కవిత్వంలో, వ్యక్తిత్వంలో అనేక విశిష్టతలను వివరించారు.
ఇవి కూడా చదవండి..
Srsp Project : ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్ఫ్లో
ఎంగేజ్మెంట్ రింగ్తో స్టార్ క్రికెటర్
కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం