హైదరాబాద్ : జ్ఞానపీఠ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి 90వ జయంతి వేడుకలు హ్యుస్టన్ నగరంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి ఓమన్, వేగేశ్న ఫౌండేషన్, సంతోషం ఫిల్మ్ న్యూస్, శారదా ఆకునూరి, అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వంశీ సంస్థ వ్యవస్థాపకులు కళా బ్రహ్మ, శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. గత 40 ఏండ్ల నుంచి సినారె జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సినారె రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో ఎంపీ నిధుల నుంచి రూ. 42 లక్షలతో వేగేశ్న ఫౌండేషన్లోని దివ్యాంగులకు భవనం నిర్మించారని గుర్తు చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, కళాతపస్వి కే విశ్వనాథ్ సినారెతో తనకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు.
సినారెకు నివాళులర్పించిన వారిలో నటి జమునా రమణారావు, మాగంటి మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్ తేజ, సంగీత దర్శకులు సాలూరు వాసురావు, మాధవపెద్ధి సురేష్ సినీగేయ రచయిత భువనచంద్ర, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, గీతా గాన గంధర్వ ఎల్ వి గంగాధర శాస్త్రి, అపర ఘంటసాల తాతా బాలకామేశ్వర రావు, అమెరికా నుంచి డా శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, లండన్ నుంచి డాక్టర్ నగేష్ చెన్నుపాటి, సంతోషం ఫిల్మ్ న్యూస్ వ్యవస్థాపకులు సురేష్ కొండేటి, తెలుగు కళాసమితి ఓమన్, అనిల్ కుమార్ కడించెర్ల, హరి వేణుగోపాల్ ఓమన్, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దీపికా రవి, వంశీ అధ్యక్షులు డాక్టర్ తెన్నేటి సుధ దేవి, మేనేజింగ్ ట్రస్టీ వంశీ, చైర్ పర్సన్ వేగేశ్న, శ్రీమతి సుంకరపల్లి శైలజ ఉన్నారు.