నల్లరాజుపాలెం (అనంతసాగరం): ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా దసరా, బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చింది.
బతుకమ్మ పాటలతో, నృత్యాలతో వేడుకలు స్థానికులను అలరించాయి. ఈ వేడుకలను సంస్థ నిర్వాహకులు సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి నిర్వహించారు.
బతుకమ్మ అలంకరణతో పాటు పిల్లలు, మహిళల చేత కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారు.
మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, ఫిన్లాండ్ లో వున్న మన తెలుగు వారికి అండగా ఉంటామని సంస్థ ఉపాధ్యక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి, సత్యనారాయణ స్పష్టం చేశారు.