హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మన తెలుగు అసోసియేషన్ ( MATA ) జర్మనీ ఎన్నారైలు ముందుకు వచ్చారు. టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలను మన తెలుగు అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ కళ్లెపల్లి సంప్రదించి.. తమ వంతు తెలంగాణ ప్రభుత్వానికి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పంపుతున్నామని తెలిపారు.
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎన్నారైలు అభినందిస్తున్నారని మహేశ్ బిగాల తెలిపారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పడిన కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. కొవిడ్ రోగులకు అండగా ఉండి, సహాయం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత కృషిని ఎన్నారైలు అభినందిస్తున్నట్లు మహేశ్ బిగాల పేర్కొన్నారు.