న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మూడు ఆస్పత్రుల్లో ‘బ్లాక్ ఫంగస్’ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. లోక్నాయక్ జయప్రకాష్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రి, గురుతేజ్ బహదూర్ ఆస్పత్రి (జీటీబీ), రాజీవ్ గాంధీఆస్పత్రిలో ‘బ్లాక్ ఫంగస్’కు డిడికేటెడ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దేశ రాజధానిలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులపై అధికారులు, నిపుణులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం జరిపారు. ‘అధికారులతో జరిపిన అత్యవసర సమావేశంలో బ్లాక్ ఫంగస్ అంశం చర్చించాం. వ్యాధి పెరుగకుండా నిలువరించాల్సి ఉంది. ఈ వ్యాధి బారిన పడినవారికి త్వరలోనే మంచి చికిత్స అందించడం జరుగుతుంది’ అని కేజ్రీవాల్ ఒక ట్విట్టర్లో పేర్కొన్నారు.
వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, చికిత్సకు సంబంధించిన కీలక నిర్ణయాలను సమావేశంలో తీసుకున్నట్టు కూడా కేజ్రీవాల్ తెలిపారు. ఎల్ఎన్జేపీ, జీటీబీ, రాజీవ్ గాంధీ ఆస్పత్రిల్లో బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కేంద్రాల ఏర్పాటు, చికిత్సకు అసరమైన మెడిసన్ అందుబాటులో ఉండేలా చూడటం, వ్యాధి విస్తరించకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సీఎం పేర్కొన్నారు.