న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుకునేందుకు అనువైన, చురుకైన వ్యాక్సినేషన్ వ్యూహాలు కీలకమని లాన్సెట్ నివేదిక పేర్కొంది. భారత్లో బాధ్యతాయుత చురుకైన వ్యాక్సినేషన్ వ్యూహాల పేరుతో లాన్సెట్ తాజా సంచికలో ఈ నివేదిక ప్రచురితమైంది. పరిమిత వ్యాక్సినేషన్ వనరులున్నా వాటిని గరిష్ట ప్రభావం ఉండేలా వాడవచ్చని తమ విశ్లేషణలో వెల్లడైందని పేర్కొంది. వేగంగా వ్యాప్తిచెందుతున్న మహమ్మారికి మన స్పందనలో అనువైన వ్యూహాలతో ముందుకెళ్లడం కీలకమని స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చురుకైన, అనువైన వ్యాక్సినేషన్ వ్యూహం ప్రజల ప్రాణాలు వారి జీవనోపాధిని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత మార్గదర్శకాలకు లోబడి ఇంటింటికీ వ్యాక్సినేషన్ వంటి వ్యూహాలు సాధ్యం కావని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు, నగర ప్రాంతాల్లో వెల్ఫేర్ అసోసియేషన్స్ సహకారంతో వ్యాక్సినేషన్ చేపట్టడం వంటి వినూత్న విధానాలను భారత్లో అనుసరిస్తున్నారని పేర్కొంది.
వ్యాక్సినేషన్ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజలకు సౌలభ్యంగా మొబైల్ వ్యాక్సినేషన్ సదుపాయాలను కల్పిస్తున్నారని తెలిపింది. మహమ్మారి అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టి తర్వాత ఆ జిల్లాలో మిగిలిన ప్రాంతాలకు వ్యాక్సినేషన్ను విస్తరించడం వంటి వ్యూహాలు కూడా మెరుగైన ఫలితాలు ఇస్తాయని లాన్సెట్ నివేదిక సూచించింది.