ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్ల విక్రయాలు
గోదావరిఖనిలోనే రోజూ 70వేల అమ్మకాలు
రూ.6.50 నుంచి రూ.7
కోల్సిటీ, మే 23: ఇప్పుడు అందరి తాపత్రయం ఒక్కటే… ఒంట్లో శక్తిని (ఇమ్యూనిటీ పవర్)ను పెంచుకోవడమే. ఆరోగ్యానికి ‘అండ’గా నిలబడే ఆహార పదార్థాలపై దృష్టి సారిస్తున్నారు. పిల్లలు ఎదగాలన్నా… పెద్దలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. సమతులాహారం గల గుడ్డు తినాలి అని చెబుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు సులువైన మార్గం ఒక్క గుడ్డులోనే దాగి ఉంది. పాలు, మాంసం, ఇతర కూరగాయలతో పోలిస్తే కోడిగుడ్డులో 93.7 శాతం ప్రొటీన్లు లభిస్తుండడంతో చిన్నా, పెద్ద అందరూ రోజువారీ ఆహారంలో ఒక భాగంగా అలవాటు చేసుకున్నారు. వారం రోజుల నుంచి జిల్లాలో కోడిగుడ్ల వినియోగం విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ఒక్క గోదావరిఖనిలోనే రోజుకు సుమారు 60 నుంచి 70వేల గుడ్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ధర కూడా రూ.7కు పెరగడం గమనార్హం. ఈమేరకు గోదావరిఖనిలోని ప్రధాన మార్కెట్ నుంచి ఆదివారం హోల్సేల్లో ఒక కోడిగుడ్డును రూ.5.60కు విడుదల చేయగా, ప్రజల వద్దకు వచ్చేసరికి రూ.7కు విక్రయిస్తున్నారు.
సిద్దిపేట నుంచి..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో కోడిగుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో గుడ్లకు డిమాం డ్ పెరగడంతో ఈ వారం రోజుల్లోనే దిగుమతి ఒక్కసారిగా రెట్టింపు అయిందని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు. సిద్దిపేట ఫామ్ నుంచి జిల్లాకు కోడిగుడ్లు రవాణా జరుగుతుంటాయి. వారంలో ఒకరోజు జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాలకు దిగుమతి కాగా, ఇక్కడి నుంచి హోల్సేల్గా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతా యి. సాధారణ రోజుల్లో ఒక్క గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి మాత్రమే సుమారు 50వేల కోడిగుడ్లు దిగుమతి చేసుకుంటారు. ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెరగడంతో వారం రోజుల నుంచి ఒక్క గోదావరిఖనికే సుమారు 70వేల వరకు దిగుమతి చేసుకుంటున్నట్లు మార్కెట్ నిర్వాహకులు తెలిపారు. సిద్దిపేట నుంచి వారానికి ఒకసారి మాత్రమే దిగుమతి చేసుకుంటారు. అలా వచ్చిన వాటిని వారమంతటా ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు హోల్సేల్ ధరల్లో విక్రయిస్తారు. ఇటీవల కాలంగా గుడ్ల వినియోగం పెరగడంతో సిద్దిపేట నుంచి వారానికి ఒకసారి వచ్చే కోడిగుడ్లు ఒక్కరోజులోనే నగరంలోని వివిధ ప్రాంతాలకు రవాణా జరుగుతున్నాయని, మిగతా ఆరు రోజులు కొరత ఏర్పడుతుందని హోల్సేల్ వ్యాపారి ఒకరు చెప్పారు.
ఒక్కసారిగా ప్రాధాన్యం..
ప్రతి వ్యక్తి సగటున ఏడాదికి 180 కోడిగుడ్లు తినాలని భారత జాతీయ పోషకాహార మండలి స్పష్టం చేసింది. ఈ కరోనా మహమ్మారి నుంచి తట్టుకునేందుకు చిన్నా, పెద్ద ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మాంసం, ఆకు కూరలు, పాలు సమృద్ధిగా తీసుకుంటున్నారు. వీటన్నిటిలో కంటే ఒక్క కోడిగుడ్డులోనే 93.7 శాతం ప్రొటీన్లు ఉన్నాయని వైద్యులు నిర్ధారించడంతో గుడ్డుకు ఒక్కసారిగా ప్రాధాన్యం పెరిగింది. ఒక గుడ్డులో సాధారణంగా ప్రొటీన్లు, నియాసిన్, రిబోప్లావిన్, క్లోరిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, గంధకం, జింక్ లభిస్తుంటాయి. లోప లి పచ్చ సొనలో విటమిన్లు ఏ, డీ, ఈ, బీ12, ఫో లిక్ ఆమ్లం, కాల్షియం, ఇనుము, రాగి, ఫాస్పరస్ ఉంటాయి. మనిషి రోజు తినే ఆహారంలో 9 రకా ల అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు ఉండాలంటే అది ఒక్క గుడ్డుతోనే సాధ్యమంటున్నారు.