లక్షెట్టిపేట రూరల్, జూన్ 6 : రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ రైతును రాజుగా చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013-14 సంవత్సరం యాసంగి లో కేవలం మూడు వేల ఎకరాలు మాత్రమే సాగయ్యేదని, నేడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా గూడెం ఎత్తిపోతల పథకంతో 30 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే పంట దిగుబడి ఐదింతలు పెరిగిందన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాలతో ఎండా కాలం వస్తే కనీసం పశువులకు తాగు నీరు కూడా ఉండేది కాదన్నారు. అలాంటిది నేడు ఎల్లంపల్లి రిజర్వాయర్లో 10 టీఎంసీలు నీరుండడంతో నీటి లభ్యత పుష్కలంగా పెరిగిందని తెలిపారు. దండేపల్లి మండలంలోని నంబాల, కాసిపేట, లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మోదెలలో ఎత్తిపోతల ప్రాజెక్టులు నేడు కళకళలాడుతున్నాయని ఇవి చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ రైతుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నాయన్నాయని మండపడ్డారు. ఈ యాసంగిలో కేవలం దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో రైతులు ఎన్నడూ లేనంతగా 103693.44 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించారని తెలిపారు. సుమారుగా 200 కోట్ల ఆదాయం రైతులకు చేరిందని ఆయన పేర్కొన్నారు. మే 31 లోపు మొత్తం వరి ధాన్యం కొన్నట్లు తెలిపారు. రైతు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో క్వింటాల్ వరి ధాన్యానికి రూ.1200 మాత్రమే మద్దతు ధర చెల్లిస్తున్నారని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రూ.1880కి కొంటున్నామని తెలిపారు. రూ.80 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ నాయకులు మాకు నీతులు చెప్పడమేమిటని మండిపడ్డారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు గరిసే రవీందర్ పలువురు సర్పంచ్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేటలో వంద పడకల దవాఖానను నిర్మించాలి
లక్షెట్టిపేటలో వంద పడకల దవాఖానను నిర్మించాలని వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుకు వినతిపత్రం అందించారు. లక్షెట్టిపేటలోని విశ్రాంతి భవనానికి వచ్చిన ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న వైద్యశాలలో సౌకర్యాలను మెరుగు పరచాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని, సమయ పాలన పాటించని డాక్టర్లపై చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దుంపల రంజిత్ కుమార్, శ్రీరాముల వెంకటేశ్, అడ్లూరి హరీశ్ కుమార్ తదితరలున్నారు.