‘పల్లెప్రగతి’తో మారిన గ్రామ స్వరూపం
ప్రభుత్వ సహకారంతో సమకూరిన వసతులు
అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్న పల్లె
రఘునాథపాలెం, జూలై 4: ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ‘కోటపాడు’ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లెప్రగతి కార్యక్రమం ఆ ఊరి రూపురేఖలను మార్చివేసింది. ప్రభుత్వం నిర్దేశించిన మౌలిక వసతులన్నీ సమకూర్చుకొని శోభాయమానంగా దర్శనమిస్తోంది. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్యార్డుల నిర్మాణం పూర్తయ్యాయి. స్వచ్ఛ పల్లెగా పరిఢవిల్లుతోంది. గ్రామంలోకి ప్రవేశించగానే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా కనిపించే హరితహారం చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. మొదటి విడత పల్లెప్రగతిలో పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేశారు. పంచాయతీ పాలకవర్గ బాధ్యులు ప్రభుత్వ సహకారంతో, గ్రామస్తుల ఐక్యతతో మౌలిక వసతులన్నింటినీ సమకూర్చుకొని గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు.
రూ.22 లక్షలతో వైకుంఠధామం..
గ్రామానికో వైకుంఠధామం నిర్మించాలని తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం కోటపాడు గ్రామానికి అందివచ్చిన అవకాశంగా మారింది. అప్పటివరకు గ్రామంలో ఎవరైనా చనిపోతే దహనసంస్కారాలకు సరైన స్థలం లేక గోసపడేవారు. వైకుంఠధామం రావడంతో గ్రామస్తుల అవస్థలు ఇకపై తీరుతాయనే ఆశలు చిగురించాయి. అయితే వైకుంఠధామం నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలం సరిపడా లేకపోవడంతో తొలుత కొంత నిరాశ చెందారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపనతో సర్పంచ్ బాతుల రమణ సుధాకర్ స్థలం కోసం దాతల సహకారం కోరారు. దీంతో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నెల్లూరి చంద్రయ్య ప్రభుత్వ స్థలానికి ఆనుకొని తనకున్న స్థలంలో రెండు కుంటలను వైకుంఠధామం నిర్మాణానికి దానం చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులకు తోడు సర్పంచ్ మరికొన్ని వెచ్చించి మొత్తం రూ.22 లక్షల వ్యయంతో శరవేగంగా వైకుంఠధామం, అందులోనే డంపింగ్యార్డు నిర్మించారు. వైకుంఠధామం వెళ్లేందుకు ఫార్మేషన్ రోడ్డునూ వేశారు.
ఆహ్లాదంగా ‘పల్లెప్రకృతి వనం’
రాష్ట్ర ప్రభుత్వం ఊరికో పల్లెప్రకృతి వనం ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టడంతో మళ్లీ స్థలం సమస్యగా మారింది. అయితే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించిన సర్పంచ్.. గ్రామానికి ఆనుకొని అర కిలోమీటరు దూరంలో ఉన్న అరెకరం డొంక స్థలంలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవున ఏటా వర్షపు నీరు పారి లోతట్టుగా ఉండే ఆ డొంక స్థలాన్ని మట్టితో నింపి చదును చేశారు. ఈ క్రమంలో సర్పంచ్ కుటుంబ మొత్తం శ్రమించి డొంక స్థలంలో పని చేసి ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించారు. అనంతరం అధికారుల సూచనల మేరకు స్థలంలో ఏపీలోని కడియం నుంచి తెచ్చిన పెద్ద పెద్ద మొక్కలను నాటారు. ఇందుకు రూ.6.50 లక్షలను వెచ్చించారు. ప్రస్తుతం పల్లెప్రకృతి వనం పచ్చని చెట్లతో పరిఢవిల్లుతోంది. ఇవిగాక రూ.30 లక్షల వ్యయంతో ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్లు, రూ.16 లక్షల సీడీపీ నిధులతో సీసీ రోడ్లు నిర్మించారు. రూ.3.50 లక్షలతో బీసీ కాలనీ నుంచి చిమ్మపూడికి వెళ్లే రహదారికి ఫార్మేషన్ రోడ్డు నిర్మించారు. నిత్యం ఉపాధి హామీ పథకం కింద 150 మంది కూలీలు పనులు చేస్తున్నారు.