హైదరాబాద్ : కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జీ. నారాయణ రాజు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ ఉన్నతాధికారిగా ఉన్న నారాయణ రాజు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్ర మంత్రులకు ఎప్పటికప్పుడు నారాయణ రాజు సూచనలు ఇచ్చేవారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయాలను కేంద్రానికి గట్టిగా వినిపించిన నారాయణ రాజు కరోనా బారిన పడి మృతి చెందడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు కోసం రాజ్యసభ చైర్మన్, భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతో తనతోపాటు రాజ్యసభలో టీఆర్ఎస్ సభా పక్ష నేత కే. కేశవరావు సమావేశమైన సందర్భంగా నారాయణ రాజు క్రియాశీలక పాత్రను పోషించి కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారని వినోద్ కుమార్ వివరించారు.
నారాయణ రాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..