గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాల కల్పన
ప్రతి ఇంటి ఎదుట విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్పుల ఏర్పాటు…
హరితహారంలో పది వేల మొక్కలుసదాశివనగర్, ఏప్రిల్ 3:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం. ప్రభుత్వ నిధులు రూ. 28 లక్షలతో సీసీ రోడ్లు , రూ. 30 లక్షలతో సీసీ మురికి కాలువల నిర్మాణం చేపట్టారు. ఇండ్ల ముందు ఉన్న విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్పులు ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 25వేల మొక్కలను పెంచుతున్నారు. ప్రతి ఇంటికీ ఐదు తులసి మొక్కలు నాటించారు. ఎంపీ నిధులు రూ. 5 లక్షలతో గ్రామంలో రెండు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనంలో రెండు వేల వివిధ రకాలు మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలో రోడ్డుకు ఇరు వైపులా అవెన్యూ ప్లాంటేషన్ పథకంలో రెండు వేల మొక్కలు నాటి కంచెలు ఏర్పాటు చేశారు. వాటికి ప్రతిరోజూ ట్రాక్టర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.గ్రామ శివారులో మంకీ ఫుడ్కోర్టులో 600 పండ్ల మొక్కలను నాటి పెంచుతున్నారు.
పూర్తయిన అభివృద్ధి పనులు
ప్రభుత్వ ప్రత్యేక నిధులతో గ్రామంలో వైకుంఠధామం, విలేజ్ నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, మంకీ పుడ్ కోర్టు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల్లో మొక్కలు నాటి పెంచుతున్నారు. గ్రామంలో ఇంటింటికీ మరుగు దొడ్డి నిర్మించారు. వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేసి రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీటిని అందిస్తున్నా రు. జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు బీటీ రోడ్డును నిర్మించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తోంది.
పక్కాగా అమలుచేస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం.హరిత హారంలో మొక్కలు నాటి సంరక్షిస్తు న్నాం. వైకుంఠధామం, డం పింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, విలేజ్ నర్సరీ, సీసీ రోడ్లు, మురికి కాలువల ఏర్పాటు తో గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని కుళాయిల ద్వారా అందజేస్తున్నాం.
-పైడి జానకి సర్పంచ్, అడ్లూర్ ఎల్లారెడ్డి