ఇందూరు : శాంతి భద్రతల పరిరక్షణకు అమరులైన పోలీసు జవాన్ల సేవలు, వారి త్యాగాలు మరువలేమని జిల్లా అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, నిజామాబాద్ సీపీ కార్తికేయ, డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ వెంకటేశ్వర్లు పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్రామిశ్రా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేయడం వల్లనే మనం సుఖంగా, సంతోషంగా ఉన్నామన్నారు. అమరుల త్యాగాలు వెల కట్టలేనివని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు.
వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. సీపీ కార్తికేయ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖంగా నిద్ర పోవాలంటే పోలీసు మేల్కొని ఉంటారని గుర్తు చేశారు. ప్రతి పోలీసు తమ విధి నిర్వహణలో కర్తవ్యం కోసం ముందుంటారని గుర్తుచేశారు. గడిచిన సంవత్సర కాలంలో దేశంలో మొత్తం 377 మంది పోలీస్ అధికారులు, పోలీసులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ ఎన్.శ్వేత, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్బాబు, అనదపు డీసీపీ (అడ్మిన్) ఉష విశ్వనాథ్ తిరునగిరి, అదనపు డీసీపీ (ఎఆర్) పి.గిరిరాజ్, కామారెడ్డి అదనపు ఎస్పీ (అడ్మిన్) అనోన్య, నిజామాబాద్ ట్రాఫిక్ ఎసీపీలు వెంకటేశ్వర్లు, ఆర్.ప్రభాకర్రావు, కామారెడ్డి ఎఆర్ డీఎస్పీ హృదయకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.