కోటగిరి : గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో పురుగుల మందు కలపడంతో చేపలు చనిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాంగంగానగర్లో నివాసముండే కచ్చకాయల రాముకు చెందిన చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. చెరువులో ఉన్న 5 వేల చేపలు మృతి చెందాయని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వ సాయంతో సోంపూర్ శివారులో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులో 11 నెలల క్రితం 5 వేల చేప పిల్లలను వేశాడు.
చేపలు పట్టే వయసు వచ్చిన సమయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు వేశారు. బుధవారం ఉదయం చేపలకు దాణా వేయాలని చెరువు వద్దకు వెళ్లగా చేపలు మృతి చెంది ఉన్నాయని, చేపల మృతితో రూ. 2. 50 లక్షల నష్టం వచ్చిందని బాధితుడు రాము ఆందోళన వ్యక్తం చేశాడు.