నవీపేట, ఫిబ్రవరి 9 : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భా రం మోయలేక.. పిల్లలకు ఎలాగైనా ఇంగ్లిష్ మీడియం లో చదువులు చెప్పించాలని నిర్ణయించుకున్నారు. గ్రా మస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఆంగ్లబోధనకు శ్రీకారం చుట్టారు. రెండేండ్లుగా ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు యంచ గ్రామస్తులు.
2019 సంవత్సరంలో యంచ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 17 మాత్రమే.. భారమైనా అందరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని ఆలోచన వచ్చింది. గ్రామస్తులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ముగ్గురు ఉపాధ్యాయులను సొంతంగా నియమించుకున్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధనకు శ్రీకారం చుట్టారు. దీంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 120కి చేరింది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన పేద ప్రజలకు ఓ వరంలా మారనున్నది. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఇంగ్లిష్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కార్ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది.
-కాశీపురం లాల్రాం, మాజీ వీఆర్వో, యంచ
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయడం సాహసోపేత నిర్ణయం. పేద ప్రజలకు ఫీజుల భారం తగ్గి అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది. సర్కారుకు మా వంతు సహకారం అందిస్తాం. ఇకనుంచి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే ఆవకాశం ఉంది.
– హన్మారెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు, నవీపేట
భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభు త్వం అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చేస్తున్నది. దీంతో పేద మధ్య తరగతుల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలల ఫీజుల బాధలు ఇక తప్పినట్లే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది.
-పిల్లి శ్రీకాంత్, నవనిర్మాణ్ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి