ఖలీల్వాడి/ నిజామాబాద్ క్రైం, జనవరి 28: రథ సప్తమిని పురస్కరించుకొని శనివారం ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు కిటకిటలాడాయి. ప్రత్యేక పూజ లు, అభిషేకాలు కొనసాగాయి. నిజామాబాద్ నగరంలోని నీల కంఠుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం నీల కంఠుడి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేషంగా అలంకరించిన రథంపై గంగాదేవి, పార్వతి సమేతంగా నీలకంఠుడి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రథోత్సవానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేష భక్త జన సంద్రం మధ్య రథయాత్ర కొనసాగగా..రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఆలయం నుంచి తల్లిఘోరీ వరకు సాగింది. ఘోరీ వద్ద ప్రత్యేక పూజల అనంతరం రథం తిరిగి ఆలయానికి చేరుకున్నది.
కార్యక్రమంలో ఆలయ ఈవో వేణు, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కార్పొరేటర్లు, రథోత్సవ, ఆలయ కమిటీ చైర్మన్ బిల్లా మహేశ్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రథ యాత్ర సందర్భంగా ఆర్మూర్ వైపునకు వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. బస్సులు జిల్లా పరిషత్ చౌరస్తా ఎడమ వైపునుంచి రామాలయం, చంద్రఖర్ కాలనీ బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.