నందిపేట్, ఫిబ్రవరి1: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఐదు రోజుల పాటు సాగిన సాధు సమ్మేళనం బుధవారంతో ముగిసింది. జనవరి 27 నుంచి మొదలైన సాధు సమ్మేళనం ఎంతో భక్తి శ్రద్ధలతో సాగింది. అఖిలాంధ్ర 57వ సాధు సమ్మేళానానికి దేశ నలుమూలల నుంచి వందలాది మంది సాధువులు, పీఠాధిపతులు హాజరై ఐదు రోజుల పాటు దైవ సందేశం ఇచ్చి భక్తి, సన్మార్గం గూర్చి భక్తులకు వివరించారు.
కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగి రాములు మహరాజ్ ఎంతో పట్టుదలతో నిర్వహించిన సాధు సమ్మేళనం విజయవంతమైంది. వేలాది మంది భక్తులు వచ్చి సాధువుల ఆశీస్సులు పొందారు. హాజరైన భక్తులకు నిత్యం భో జనాలను ఏర్పాటు చేశారు. మహరాజ్ సాధువులకు, పీఠాధిపతులకు వస్త్రాలు సమర్పించారు. ఆఖరి రోజైన బుధవారం సాధు సమ్మేళనానికి పరిపూర్ణనంద స్వామి హాజరయ్యారు. సాధు సమ్మేళనం ఇంత గొప్పగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జీవన్రెడ్డి దంపతులు సాధువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. మంగిరాములు మహరాజ్ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో సాధువులు, ప్రజాత్రినిధులు, భక్తులు పాల్గొన్నారు.