ఇందూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఉన్న అన్ని మండపాల ప్రతిమలకు జియో ట్యాగింగ్ అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్టార్ల వారీగా పెట్రోలింగ్ నిర్వహించే బ్లూకోర్ట్స్ సిబ్బంది గణేశ్ మండపాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ట్యాబ్ల ద్వారా సంబంధిత గణేశ్ మండపాల చిత్రాలను తీసుకోవటంతో పాటు నిర్వాహకులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వెబ్ అప్లికేషన్ ద్వారా క్షేత్రస్థాయిలో జియో ట్యాగింగ్కు అనుసంధానం చేయనున్నామని జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ వెల్లడించారు. సోమవారం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేశ్ మండపాల వద్ద ఏదైనా సమస్య తలెత్తినప్పుడు జియో ట్యాగింగ్ ద్వారా సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు త్వరితగతిన చేరుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
గణేశ్ మండపాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో పోలీసు భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 5490 గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేయగా డివిజన్ పరిధిలో 2466, ఆర్మూర్లో 2017, బోధన్ 1007 విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు.ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా విగ్రహాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులకు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా తొలిసారిగా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న నిర్వాహకులకు స్థానిక పోలీసుల అనుమతులను మంజూరు చేశామన్నారు.
గణేశ్ మండపాలకు కల్పిస్తున్న భద్రతలో భాగంగా సెక్టార్ వారీగా విధులు నిర్వహించే బ్లూకోర్ట్స్, పెట్రోకార్ సిబ్బంది ప్రతిరోజు వంతుల వారీగా మూడు పర్యాయాలు మండపాలను సందర్శించి అక్కడి స్థితిగతులపై అధ్యయనం చేస్తుందని కార్తికేయ పేర్కొన్నారు. భద్రత విషయంలో నిర్వాహకులకు సూచనలు చేస్తూ మండపాల వారీగా జారీ చేసిన పాయింట్ బుక్లో సెక్టార్ పోలీస్ సిబ్బంది సంతకం చేస్తారని వివరించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని , నిమజ్జన రథయాత్ర కొనసాగే మార్గాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కెమెరాలు ఐపీ టెక్నాలజీతో రూపొందించామన్నారు