ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే కొంత మంది ప్రైవేటు అంబులెన్స్ల యజమానులు బాధితుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కరోనా బాధితుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు చేసేందుకు ఆర్టీఏ అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు
ఖలీల్వాడి, మే 5 : నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా.. జిల్లా యంత్రాగం తీసుకుంటున్న చర్యలతో బాధితులు త్వరగా కోలుకుంటున్నారు. జిల్లా మహారాష్ట్రకు దగ్గరగా ఉండడం.. అక్కడి వారు ఇక్కడికి రావడంతో కేసులు పెరుగుతున్నాయి. దూరప్రాంతల నుంచి వచ్చి కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు అంబులెన్స్ యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. కరోనాను ఆసరాగా చేసుకొని జిల్లాలో ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి రావడంతో అంబులెన్స్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మోటార్ వెహికిల్ చట్టం నిబంధనలు, డీఎం యాక్ట్ 2005కు అనుగుణంగా డబ్బులు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేసే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. కరోనాతో మరణించిన వారి కటుంబాల వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మరికొందరు ఒకే అంబులెన్స్లోనే రెండు, మూడు మృతదేహాలను తీసుకెళ్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలే ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ ఆధ్వర్యంలో దాడులు చేశారు. అధిక డబ్బులు వసూలు చేస్తే నిజామాబాద్ ట్రాన్స్పోర్టు కమిషనర్ 9948788445, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ 9666364494, ఆర్మూర్ 7330771561,బోధన్ 8374488999 నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు.