కమ్మర్పల్లి, మే 30 : కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ను మరోపదిరోజులపాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 12వ తేదీ నుంచి 18 రోజులపాటు లాక్డౌన్ అమలు చేయడంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేసింది. సత్ఫలితాలు ఇస్తుండడంతో జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించింది. అధికారులు లాక్డౌన్ను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. వ్యవసాయ పనుల ప్రారంభం, ఇతర కారణాల నేపథ్యంలో ప్రభుత్వం సడలింపు సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెంచింది.
జిల్లాలో లాక్డౌన్ అమలు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది. మే 12వ తేదీన లాక్డౌన్ అమలులోకి వచ్చే నాటికి జిల్లాలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. మరణాలు నమోదుకావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. అధికార యంత్రాంగం లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడంతో వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. లాక్డౌన్ అమలు, కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయ ప్రతిరోజూ స్వయంగా రంగంలోకిదిగారు. లాక్డౌన్ కారణంగా అందరూ ఇండ్లకే పరిమితం కావడం, అదే సమయంలో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేతో ప్రాథమిక దశలోనే కొవిడ్ బాధితులను గుర్తించి మెడికల్ కిట్లు అందజేశారు. ఫలితంగా కొవిడ్ బాధితుల మరణాలు తగ్గాయి. ఫ్రంట్ లైన్ వారియర్ల కృషి ఫలితాలను ఇస్తున్నది.
మరో పది రోజుల పాటు పొడిగించిన లాక్డౌన్లో సడలింపులు ప్రజలకు కొంత ఊరటను, వెసులుబాటును ఇచ్చాయి. ఇది వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఉండగా, ప్రస్తుతం మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు ఇచ్చింది. వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్లినవారు ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ఇండ్లకు చేరుకోవడానికి గంట సమయం ఇచ్చింది. వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు, వ్యాపారులకు సడలింపులు ఊరటనిస్తాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.