కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక సతమతమవుతున్న నిరుపేదలకు ప్రభుత్వం పని కల్పిస్తూ భరోసానిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు తగ్గడంతో కూలీలు ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. వేసవిలో కూలీ రేటు పెంచడంతోపాటు ప్రతి రోజూ పని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఉదయం పనులు ప్రారంభించి 11 గంటల్లోపే ముగిస్తుండడంతో పెద్ద సంఖ్యలో కూలీలు పనులకు హాజరవుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,66,580 కుటుంబాలు ఉన్నాయి. గ్రామాల్లో కూలీలకు పనులు లేనిచోట ఉపాధి హామీ ద్వారా పని కల్పిస్తున్నారు. వివిధ గ్రామాల పరిధిలో పనులను చేపడుతూ వంద రోజులు ఉపాధి పనులు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి 85లక్షల పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటి వరకు జిల్లా అంతటా 21,39,708 పని దినాలు కల్పించారు. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా పనులను కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విధంగా ప్రతి ఒక్కరికి రూ.237 కూలీ వచ్చేలా పనులు చేయిస్తున్నారు.
ప్రాధాన్యక్రమంలో పనులు..
జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో పనులను గుర్తించారు. గ్రామాల్లో ఏ పనులు ప్రాధాన్యంగా ఉన్నాయో వాటిని ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. చెరువుల్లో నీళ్లు లేనిచోట పూడికతీత, అటవీ ప్రాంతంలో కందకాల తవ్వకాల పనులు చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రతి నెలా లక్ష మందికి పైగా ఉపాధి హామీ పనులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే మరింత ఎక్కువ మందికి పనులను కల్పించేందుకు నిర్ణయించారు. చేసిన పనికి అనుగుణంగా కూలీల అకౌంట్లో ఆన్లైన్ ద్వారా డబ్బులను జమ చేస్తున్నారు. ప్రతి వారం వారికి డబ్బులు అందేలా ఏర్పాట్లు చేశారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
ఉపాధి పనులకు వచ్చే కూలీలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పనులు జరిగే చోట నీరు, నీడతోపాటు శానిటైజర్ను అందుబాటులో ఉంచుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్న వారు పనులు రాకుండా అవగాహన కల్పిస్తున్నారు.
85 లక్షల పని దినాలు కల్పిస్తాం..
వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో కూలీలకు 85 లక్షల పని దినాలను కల్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదిక పంపించాం. అర్హులైన కూలీలకు వంద రోజుల పని కల్పించాల్సి ఉన్నందున 85లక్షల పనిదినాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కల్పించనున్నాం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 79,88,581పని దినాలు కల్పించాం.