ఇందూరు, మార్చి 30 : గ్రామపంచాయతీల్లో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు. కలెక్టర్తోపాటు జిల్లా పంచాయతీ అధికారిణితో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్ననేపథ్యంలో ఓటరు జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఏప్రిల్ 3వ తేదీన డ్రాప్ట్ ఓటర్ల జాబితా ముద్రించాలని, 6వ తేదీన జిల్లా స్థాయిలో, 7వ తేదీన మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని, 10న అభ్యంతరాలను పరిశీలించాలని సూచించారు. 12వ తేదీన తుదిజాబితాను ముద్రించి ప్రదర్శించాలని ఆదేశించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఇందల్వాయి మండలం గంగారాంతండా, తిర్మన్పల్లి, భీమ్గల్ మండలం బాచన్పల్లి, మాక్లూర్ మండలం సాత్లాపూర్తండా మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలు, జిల్లా వ్యాప్తం గా 76 వార్డు మెంబర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ తదితరులు పాల్గొన్నారు.
నెలరోజుల్లో ఆడిట్ వివరాలు సెటిల్ చేయాలి
స్థానిక సంస్థలకు సంబంధించి రెండేండ్ల ఆడిట్ వివరాలను నెలరోజుల్లో సెటిల్ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. లోకల్ ఫండ్ ఆడిట్ అధికారులు, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, దేవాదాయశాఖ అధికారులతో పెండింగ్ ఆడిట్పై ప్రగతిభవన్లో మంగళవారం సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రజల అవసరాలకనుగుణంగా ఖర్చు చేయాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే అభ్యంతరం తెలిపి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనవసర ఖర్చులకు తావులేకుండా, ప్రతి రూపాయి సరైన పద్ధతిలో ఖర్చు అయ్యిందా? లేదా? అనేదానిపై నిశిత పరిశీలన చేయాలని ఆడిట్ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారి విజయ్కుమార్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, సంబంధిత శాఖల అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.