గాంధారి, మార్చి 29 :పల్లె ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేసి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మాతు సంగెం. వైకుంఠధామం, కంపోస్టు షెడ్డుతో పాటు పల్లె ప్రకృతి వనాన్ని సకాలంలో పూర్తి చేశారు. కోతుల బెడద నివారణకు గ్రామ శివారులో దాదాపు నాలుగు ఎకరాల్లో మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి రకరకాల పండ్ల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలోకి వచ్చే దారికి ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. పంచాయతీ ట్యాంకర్ సహాయంతో నిత్యం నీటిని పోస్తూ సంరక్షిస్తున్నారు. ప్రతి రోజూ వీధులను శుభ్రం చేయడంతో పాటు మురికి కాలువల్లో నీరు నిల్వ కుండా చర్యలు తీసుకుటున్నారు. ఇటీవల మంజూరైన నిధులతో గ్రామంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టారు.
వందశాతం మరుగు దొడ్ల నిర్మాణం..
దాదాపు ఎనిమిది వందల జనాభా ఉన్న గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామంలో బహిరంగ మల విసర్జనకు స్వస్తి పలికారు. దీంతో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
ఆహ్లాదకరంగా ప్రకృతి వనం..
గ్రామ శివారులోని మతాయి చెరువు కట్ట సమీపంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. చెరువు కట్ట సమీపంలోని శివాలయం చుట్టూ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడంతో ఆకర్షణీయంగా మారింది. పార్కులో నీడనిచ్చే మొక్కలతో పాటు, పండ్లు, పూల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి..
పల్లె ప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్టుషెడ్డును సకాలంలో పూర్తి చేశాం. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకున్నాం. గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయించాం.
-కమ్మరి భాస్కర్, సర్పంచ్
మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నాం..
హరిత హారంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నాం. మొక్కలను మేకలు, పశువులు మేయకుండా ట్రీ గార్డులు ఏర్పాటు చేశాం. మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్ సహాయంతో నిత్యం నీటిని పడుతున్నాం.
-సంగారావు, ఉప సర్పంచ్
ఇవీ కూడా చదవండి..
వ్యాక్సిన్ పట్ల విముఖతతో కొవిడ్-19 ముప్పు తీవ్రతరం!
వేసవిలో నిత్యం ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే ఎందుకంటే..?