ఖలీల్వాడి, మే 29 : ఆపత్కాలంలో కరోనా బాధితులతోపాటు పేదలకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సం స్థలు అండగా ఉంటున్నాయి. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుం డా ఉండడానికి భోజన వితరణ చేస్తున్నారు. కరోనా బాధితులకు, వారి సహాయకులకు అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా ఆధ్వర్యంలో చేపట్టిన భోజన వితరణ కార్యక్రమం శనివారం నాటికి 23వ రోజుకు చేరుకున్నది. జిల్లాకేంద్రంలోని ఎనిమిది ప్రధాన కూడళ్లల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం పార్సిళ్లను అందజేస్తున్నారు. శనివారం ఎనిమిది ప్రధాన కూడళ్లల్లో 1500 మందికి భోజన ప్యాకెట్లను అందజేశారు. కరోనా బారినపడి ఆహారం అవసరం ఉన్న వారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 72073 92708, 72073 92709 కాల్సెంటర్ నంబర్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
ట్రస్మా ఆధ్వర్యంలో అన్నదానం
ఇందూరు, మే 29 : ట్రస్మా ఆధ్వర్యంలో ఖలీల్వాడి, కంఠేశ్వర్, పెద్దబజార్, న్యాల్కల్ చౌరస్తా, నాగారం, వినాయక్నగర్, దుబ్బ ప్రాంతాల్లో శనివారం భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జయసింహాగౌడ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతిరోజూ రెండు వందల మందికి భోజనం అందిస్తామని పేర్కొన్నారు.
పురోహితుడు రాజేశ్ శర్మ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ రూరల్, మే 29 : నిజామాబాద్ రూరల్ మండలం పాల్ద గ్రామానికి చెందిన పురోహితుడు రాజేశ్ శర్మ శనివారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, పెద్దబజార్, ఆర్ఆర్ చౌరస్తా, గాంధీచౌక్, నెహ్రూ పార్కు, ఫూలాంగ్ తదితర ప్రాంతాల్లో 300 మంది పేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 150 మంది పోలీసులకు గ్లూకోజ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, పులిహోర ప్యాకెట్లను అందజేశారు. ప్రస్తుత కష్టకాలంలో ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాజేశ్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో యువకులు కార్తీక్, ఆశిష్, బంటు రాము, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.