నిజామాబాద్ జిల్లాలో గాడితప్పిన ప్రైవేటు దవాఖానలు
అధిక ఫీజులపై కరోనా బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు
57 కొవిడ్ వైద్యశాలల్లో సగం దవాఖానలకు నోటీసులు జారీ
బాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం
జీవో 248 ఉల్లంఘించినట్లు తేలితే క్రిమినల్ కేసుల నమోదుకు ఆస్కారం
ఆగమాగమవుతున్న యాజమాన్యాలు
నిజామాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో గడిచిన రెండు నె లల కాలం పాటు ప్రైవేటు దవాఖానలది ఆడిందే ఆట పాడిందే పాట. కొవిడ్ -19 చికిత్సను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వైద్య సేవల పేరుతో డ బ్బులు వసూలు చేశారు. సామాన్య ప్రజల నుంచి ముక్కు పిండి అధిక మొత్తంలో ఫీజులు చెల్లించుకున్నారు. ఇదేమిటని అడిగితే నిర్దాక్షిణ్యంగా దవాఖానల నుంచి గెంటెయ్యడం దగ్గరి నుంచి చివరికి మృతదేహాలను సైతం బంధువుల చేతికివ్వకుండా కర్కశత్వాన్ని ప్రదర్శించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 57 కొవిడ్ దవాఖానలు కొనసాగుతుండగా ఇందులో సగం వైద్యశాలలపై కరోనా బాధిత కుటుంబాల నుంచి అనేక ఫిర్యాదు లు వచ్చాయి. అధిక ఫీజులు వసూలు చేయడం, సౌకర్యాలు కల్పించకపోవడం, వైద్యం చేయకపోయినప్పటికీ చేసినట్లుగా చూపించడం, ఔషధాల పేరిట మాయాజాలాన్ని ప్రదర్శించడం వంటి ఘటనల్లో ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా టాస్క్ఫోర్స్ కమిటీ లు నిర్వహించిన తనిఖీల్లోనూ బయట పడిన డొల్లతనంపైనా కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించని, అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు దవాఖానలపై కొరడా ఝుళిపించేందుకు సర్కారు సన్నద్ధమైంది. కొద్ది రోజుల్లోనే ఆయా వైద్యశాలలపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సమాయత్తం అవుతున్నది.
అమలు కాని జీవో 248..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రోగుల జేబులకు చిల్లులు వేశాయి. ఆపత్కాలంలో బాధితుల గోడును ఆసరాగా చేసుకుని పలు దవాఖానలు ఇష్టానుసారంగా సొమ్ము చేసుకున్నాయి. కొవిడ్ చికిత్స పేరిట నిబంధనలకు విరుద్ధంగా బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేశాయి. ఓ వైపు ప్రభుత్వంతో పాటు జిల్లాలోని అధికారులు, మంత్రి హెచ్చరికలు జారీ చేసినా కొన్ని తమ కక్కుర్తిని వీడలేదు. రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు ముందస్తుగా చెల్లించుకుంటేనే చికిత్సకు అనుమతి.. లేదంటే బెడ్ లేదంటూ సాకులు. దవాఖానలో చేరిన తర్వాత పెండింగ్ బిల్లుల విషయంలో పీల్చిపిప్పి చేయడం రోజువారీ తంతు. చనిపోయిన తర్వాత కూడా బిల్లు పూర్తిగా చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామనేలా కర్కశత్వం. ప్రభుత్వం జారీ చేసిన జీవో 248 ప్రకారం కొవిడ్ చికిత్స అందించే ప్రైవేటు దవాఖానల్లో ఐసీయూకు రూ.9వేలు, ఆక్సిజన్ బెడ్కు రూ.7వేలు, సాధారణ వార్డుకు రూ.4వేలు తీసుకోవాలి. కానీ జిల్లా కేంద్రంలో రోజుకు రూ.20వేలను ఐసీయూ చార్జీలుగా వసూలు చేస్తూ ఇష్టానుసారంగా ప్రతి దానికి బిల్లు వేసి సామాన్యులను ముక్కి పిండి వసూలు చేశారు.
నగదు పేరిట రాద్ధాంతం…
కొవిడ్ బాధితులతో ప్రైవేటు దవాఖానల యాజమాన్యం, సిబ్బంది అడుగడుగునా అమానవీయంగా ప్రదర్శించారు. డిజిటల్ చెల్లింపులకు దవాఖానాలు ఒప్పుకోకుండా తెలివిని ప్రదర్శించాయి. ఆన్లైన్ నగదు బదిలీ, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, చెక్కుల రూపంలో చెల్లింపులు స్వీకరిస్తే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఎదురవుతాయని భయపడి నగదుకే ఒత్తిడి తెచ్చారు. నోట్లే ఇవ్వాలని షరతులు విధించి మరీ రోగులను జాయిన్ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రైవేటు దవాఖానలపై వైద్యారోగ్య శాఖ మామూళ్లకు అలవాటు పడి పూర్తిగా నియంత్రణ కోల్పోవడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్లోని కొన్ని ప్రైవేటు వైద్యశాలలు ధనదాహంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే దుస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యే సమయంలో బాధితులు అడిగిన బిల్లులు, రిపోర్టులు తప్పకుండా ఇవ్వాల్సి ఉండగా వీటి విషయంలోనూ దవాఖానల వర్గాలు రాద్ధాంతం చేశా యి. తమ తప్పులు దొరుకుతాయని ఫేక్ బిల్లులు సృష్టించి అందించారు.
చితికిన కుటుంబాలు…
కరోనా సోకిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. రూ.లక్షల్లో అప్పు చేసి బాధితులకు చికిత్స చేయిస్తున్నా బతుకుతారన్న నమ్మకం లేకుం డా పోతున్నది. ఉమ్మడి జిల్లాలో కరోనా సోకిన పలు కుటుంబాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కొందరు బంగారాన్ని అమ్ముకున్నారు. మరికొందరైతే కుదువపెట్టారు. ఇండ్ల స్థలాలు, వ్యవసాయ పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేటులో మెరుగైన వైద్యం కోసం రోజుకు రూ.30వేలు, అదనంగా మరో రూ.20వేలు వరకు బిల్లులు బాదడంతో రోజుల తరబడి జరిగిన చికిత్సతో రూ.లక్షల్లో బిల్లులు కట్టలేక ఆస్తులు పోగొట్టుకున్నవారు అనేకమంది. ఖలీల్వాడిలోని పేరొందిన కొన్ని ప్రైవేటు దవాఖానలు రోజుకు రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తేనే చికిత్స అందిస్తామని బహిరంగంగానే తెగేసి చెప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.