నిజామాబాద్, మే 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన ఇంటింటి సర్వే కరోనా కట్టడికి అద్భుత ఫలితాలు ఇస్తున్నది. ప్రత్యేక వైద్య బృందాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపడుతున్న జ్వర సర్వేతో కరోనా వైరస్ ఎక్కడికక్కడే కట్టడి అవుతున్నది. మొన్నటి వరకు లక్షణాలున్న వారంతా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇష్టానుసారంగా తిరిగారు. సర్వే నిర్వహించి లక్షణాలున్న వారికి ప్రభుత్వం ఉచితంగా కొవిడ్ మందుల కిట్ అందజేయడంతో ప్రజలంతా మందులు వాడుతున్నారు. స్వల్ప, మాధ్యమిక స్థాయి లక్షణాలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దే లభించిన మందులతో సాంత్వన చేకూరుతున్నది. ఫలితంగా కొవిడ్ వ్యాప్తి నిరోధించడంతో పాటు కరోనా కేసుల పెరుగుదలలోనూ తగ్గుదల నమోదు అవుతున్నది. వారం క్రితం వరకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో 470 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందగా.. తాజాగా కేవలం 160 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన 361 పడకలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. బోధన్ ఏరియా దవాఖానలో వారం క్రితం వరకు గరిష్ఠంగా 60 మంది కరోనా బాధితులు సేవలు పొందగా ప్రస్తుతం 16 మంది మాత్రమే ఉన్నారు. ఆర్మూర్లో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే సేవలు పొందుతున్నారు. మొన్నటివరకు ప్రతి రోజూ సగటున 50 మంది వరకు కరోనాతో చికిత్స పొందారు. కొవిడ్ కేసుల తగ్గుదలకు లాక్డౌన్ అమలు ఓ కారణమైతే… పరోక్షంగా జ్వర సర్వే అన్నది గేమ్ ఛేంజర్గా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.
సర్వేతో గ్రామాల్లో అద్భుత ఫలితాలు..
పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే అద్భుత ఫలితాలు ఇస్తున్నది. మొన్నటివరకు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ తీవ్రత పెరిగిన తర్వాతే బాధితులు దవాఖానల్లో చేరేవారు. సుమారు వారం రోజులు హోం ఐసొలేషన్లో ఉంటూ స్వీయ జాగ్రత్త చర్యలు పాటించారు. పల్లెల్లో చిన్న ఇండ్లలోనే బాధితులు ఓ గదిలో.. మిగతా కుటుంబసభ్యులు మరో గదిలో కాలం గడిపారు. చాలామంది లక్షణాలున్నప్పటికీ నిర్లక్ష్యంగా పరీక్షలు చేయించుకోలేదు. గ్రామాల్లో లాక్డౌన్ అమలైనా.. వ్యవసాయం పనుల పేరిట ఇష్టానుసారంగా తిరిగారు. ఇదే అదునుగా లక్షణాలున్న వారు సైతం గ్రామాల్లో తిరిగారు. ఇంకా కొంతమంది లక్షణాలున్నప్పటికీ బయటికి చెప్పకుండా మిన్నకుండిపోయారు. ఈ పరిస్థితులతో కొవిడ్ సోకిన వారి నుంచి చాలా మందికి వైరస్ వ్యాప్తి చెందింది. ఇంకొందరు బయటికి చెప్పకుండా దాచిపెట్టడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత సర్వేతో సిబ్బంది ప్రతి ఇంటి తలుపు తట్టడంతో మహమ్మారి కట్టడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి ముందస్తుగానే కిట్లు అందజేయడంతో మందులు వాడుతూ లక్షణాలను తగ్గించుకున్నారు. గ్రామాల్లో చాలా మంది అనుమానాలకు సర్వే ద్వారా పరిష్కారం లభించింది.
సగానికి సగం పడకలు ఖాళీ..
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన మొన్నటివరకు కరోనా బాధితులకు బెడ్ దొరికితే గగనమైన పరిస్థితి. సీరియస్ పేషెంట్లు చాలామంది చివరి నిమిషంలో జీజీహెచ్కు వచ్చేవారు. ఆఖరు అవకాశంగా ప్రైవేటు దవాఖానల నుంచి తరలి వచ్చి చికిత్స పొందేవారు. 521 పడకలతో ఎప్పటికప్పుడు కరోనా బాధితులకు ఆపన్నహస్తం అందిస్తూ జీజీహెచ్ చాలా మందికి పెద్ద దిక్కుగా నిలిచింది. వారం క్రితం వరకూ మొత్తం పడకల సంఖ్యలో 470 మంది వరకు కరోనా పేషెంట్లు చికిత్సలు తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో 160 మంది మాత్రమే సేవలు పొందుతున్నారు. ఆర్మూర్లో 100 పడకలతో కొవిడ్ దవాఖానను ఏర్పాటు చేశారు. మొత్తం పడకల్లో మొన్నటివరకు 42 మంది ఇన్పేషెంట్లు ఉండగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. బోధన్లోనూ 100 పడకలకు గాను మొన్నటివరకు 60 మంది ఇన్ పేషెంట్లు ఉండగా.. ఇప్పుడు 16 మందికి చికిత్స అందుతున్నది. కొత్తగా కరోనా కేసులకు సంబంధించి ప్రభుత్వ దవాఖానలకు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దవాఖానల్లో వైద్యసేవలు పొందుతున్న వారిలోనూ క్షేమంగా ఇంటికి వెళ్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 57 ప్రైవేటు దవాఖానల్లో 1400 పడకలు అందుబాటులో ఉండగా.. ఆయా దవాఖానల్లో ప్రస్తుతం 250 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. ప్రైవేటులోనూ కొత్తగా వచ్చే వారు ఉండడం లేదు.
జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి..
కరోనా సెకండ్ వేవ్లో సానుకూల ఫలితాలు ఇప్పుడిప్పుడే దక్కుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో భారీగా వచ్చిన కరోనా పేషెంట్లకు కాదనకుండా సేవలు అందించాం. క్రిటికల్ స్థాయిలో వచ్చిన వారిని కూడా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ అందించాం. సరిగ్గా వారం క్రితం వరకు నాలుగు వందల మంది పేషెంట్లు ఉండగా ఇప్పుడు 160 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. కరోనా తగ్గుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. అయినప్పటికీ ప్రజలంతా కొవిడ్ 19 నిబంధనలు తప్పక పాటించాలి. నిర్లక్ష్యం చేయొద్దు. జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ బారిన పడకుండా ఉండాలి.
కరోనా కట్టడికి జ్వర సర్వే దోహదం..
కరోనా కట్టడికి ఇంటింటి సర్వే దోహదం చేసింది. లక్షణాలున్న వారిని గుర్తించి ఇంటి వద్దే కరోనా ఔషధ కిట్లు అందజేయడం మూలంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రజలంతా సర్వేకు సహకరిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి లక్షణాలున్నా వైద్యసిబ్బందికి తెలియజేయాలి. వారి సలహాలు, సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. బోధన్ ఏరియా దవాఖానకు కరోనా బాధితుల రాక గణనీయంగా తగ్గింది. వారం క్రితానికి ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తున్నది. మహారాష్ట్ర నుంచి కూడా బాధితులెవ్వరూ రావడం లేదు.
గేమ్ ఛేంజర్గా మారిన జ్వర సర్వే..
కరోనా సెకండ్ వేవ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. ఓ వైపు వాక్సినేషన్ను విజయవంతంగా అమలు చేస్తూనే చికిత్సకు భారీ ఏర్పాట్లు చేసింది. కేంద్ర సర్కారు నుంచి ఆశించినంత సహకారం లేకపోయినప్పటికీ ఆర్థిక భారం పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ తగిన చర్యలు తీసుకున్నారు. కరోనా కేసుల పరంపర కొనసాగుతున్న వేళా ఆదాయ నష్టం వస్తున్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను మే 12 నుంచి అమలుచేస్తున్నది. ఇదేక్రమంలో ఎక్కడికక్కడే ప్రజలంతా ఇండ్లలోనే ఉండిపోగా సీఎం కేసీఆర్ సర్వేకు ఉపక్రమించారు. లక్షణాలతో బాధపడుతున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి కరోనా ఔషధాలు అందించాలని నిర్ణయించారు. కొద్ది రోజులుగా ఉధృతంగా సాగుతున్న జ్వర సర్వే ద్వారా ఎక్కడి వారు అక్కడే ప్రభుత్వ మందుల కిట్లతో త్వరగా కోలుకుని ఆరోగ్యవంతులవుతున్నారు. వ్యాధి ముదిరి తీవ్రం కాకుండా జ్వర సర్వే ఉపయోగపడుతుండగా.. ఇతరులకు వ్యాప్తిచెందకుండా ఉపకరిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మొదటి, రెండు దఫాలుగా చేసిన సర్వేలో దాదాపుగా 12వేల మంది అనుమానితులను గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో రెండు దశల్లో ఏడు వేల మందిని గుర్తించి కట్టడి చేయగలిగారు.