ధర్పల్లి, మే 28 : ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పనిలేకుండా ఎవరూ ఇబ్బందులు పడకూడదని, గ్రామాల్లోని కూలీలంతా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకునేలా చూడాలని డీఆర్డీఏవో చందర్నాయక్ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, పంచాయతీకార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య తక్కువగా నమోదవుతోందని తెలిపారు. కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. పనులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారందరూ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులు, ఉపాధి సిబ్బందిపై ఉన్నదని అన్నారు. మండలంలో 10,776 మంది కూలీలకు గాను శుక్రవారం 3048 మంది మాత్రమే పనులకు హాజరుకావడంపై ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కూలీలు ప్రతిఒక్కరూ ఉపాధి పనులకు వచ్చేలా కార్యదర్శులు చూడాలన్నారు. వారికి రావాల్సిన ఉపాధి డబ్బులను సత్వరమే అందేలా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న డబ్బులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఏదైనా సమస్య ఉంటే ఎంపీడీవో ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉపాధి పనులు లక్ష్యం మేర కొనసాగేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో నటరాజ్, ఇన్చార్జి ఏపీవో సంజీవ్ పాల్గొన్నారు.