నందిపేట్ రూరల్, ఏప్రిల్ 28:పల్లెప్రగతి.. ఈ ఒక్క కార్యక్రమంతో గ్రామీణ రోడ్లన్నీ పచ్చని మొక్కలతో స్వాగతం పలుకుతున్నాయి. గ్రామ పరిసరాలన్నీ శుభ్రతకు నిలయంగా మారుతున్నాయి. ప్రకృతి వనాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ శివారు ప్రారంభం నుంచి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించి వాటిని కంటికిరెప్పలా కాపాడుతున్నారు. దీంతో రోడ్లన్నీ పచ్చని చెట్లతో అందంగా కనిపిస్తున్నాయి. గ్రామ చివరలోని ఆర్మూర్ రోడ్డుకు గుట్టను ఆనుకొని విలేజ్పార్క్ నిర్మించారు. పార్క్లోని అన్ని రకాల పూల మొక్కలు నాటారు. మొక్కల మధ్యలో వాకింగ్ ట్రాక్ నిర్మించడంతో అందంగా కనిపిస్తూ అందరినీ కనువిందు చేస్తున్నది. పల్లె ప్రగతిలో కేటాయించిన నిధులతో గ్రామ శివారులో నిర్మించిన వైకుంఠధామం నందనవనంలా మారింది. వైకుంఠధామానికి చుట్టూ పెన్సింగ్ వేసి మొక్కలు నాటారు. పారిశుద్ధ్య సమస్య నివారణకు డంపింగ్ యార్డు నిర్మించారు. గ్రామంలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో స్వచ్ఛ గ్రామంగా మారింది.
మెచ్చుకున్న కలెక్టర్, అదనపు కలెక్టర్..
పల్లె ప్రగతి పనులను ఇటీవల పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లత పంచాయతీ పాలకవర్గాన్ని మెచ్చుకున్నారు. ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డును పరిశీలించి సర్పంచ్ను అభినందించారు.