కోటగిరి/ బోధన్ రూరల్, ఏప్రిల్ 28:వేసవితాపం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రజలు దాహర్తి తీర్చుకునేందుకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సూర్యప్రతాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లను తీసుకుంటున్నారు. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం స్వర్గతుల్యం అని పెద్దలు అంటుంటారు. ప్రకృతి ప్రసాదంగా లభించే కొబ్బరి నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయి. కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి అమృతంతో సమానం. నీరసంగా, అనారోగ్యంతో ఉన్నవారు రోజుకో కొబ్బరి బోండం తాగితే త్వరగా కోలుకుంటారు. చిన్న పిల్లలకు కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పని చేస్తాయి. ఈ నీటిలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైమ్ల ఎనమినోయాసిడ్లు, సైటోకిన్ అధికంగా ఉంటాయి. శరీరానికి వేసవి నుంచి ఉపశమనం ఇచ్చే నీళ్లు రుచికి వగరుగా ఉన్నా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. ఈ నీరు తాగడంతో శరీరంలో నష్టపోయిన ప్లూయిడ్స్ను భర్తీ చేస్తాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత అధికమైంది. బయటకు వచ్చిన వారు ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు చల్లని పానీయాల దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే శీతల పానీయాలను సేవించడం కన్నా.. కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వంటి పానీయాలను తీసుకోవడం మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్ పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఇది శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్ని తిరిగి భర్తీ చేస్తుందని సూచిస్తున్నారు. గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు కొబ్బరినీళ్లు చాలా ఉపయోగపడతాయి.
కొబ్బరి నీటిలో విటమిన్లు..
కొబ్బరి నీళ్లలో ఎలెక్ట్రోలైట్ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 మిల్లీ లీటర్ల కొబ్బరి నీటిలో 250 మిల్లీ గ్రాముల పొటాషియం,105 మిల్లీ గ్రాముల సోడియం లభిస్తాయి. ఈ రెండు కలిసి శరీరంలో విరేచనాలతో తగ్గిన ఎలెక్ట్రోలైట్లను పునరుత్పత్తి చేస్తాయి. తాజా కొబ్బరి నీళ్లలో కొంచెం విటమిన్ సీ(యాస్కార్బిక్ ఆమ్లం) కూడా ఉంటుంది. ఆర్డీఏలో 2.4 మిల్లీ గ్రాముల విటమిన్ సీని ఇది అందిస్తుంది.
కొబ్బరి నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు