ఎల్లారెడ్డి, మార్చి 28: గ్రామాల అభివృద్ధికి అంకితమై పని చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వం వేతనాల పెంపు ప్రకటనతో ఆనందంతో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పని చేస్తున్న వారి సేవల్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనాన్ని రెట్టింపు చేస్తానని అసెంబ్లీలో ప్రకటించడంతో మరింత ఉత్సాహం గా పని చేస్తామని అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 8 వందల మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా 410 మంది, నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు నాలుగు వందల మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులుగా చేరిన వీరికి 15 వేల రూపాయల వేతనం ఉండగా.. వేతనాన్ని రెట్టింపు చేస్తామని సీఎం ప్రకటించడంతో జూనియర్ పంచాయతీ అధికారుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
పల్లె ప్రకృతి వనాల్లో కీలక భూమిక..
ప్రతి గ్రామంలో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో పంచాయతీ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు అందరినీ ఆకట్టుకోవడంతో వీరి సేవలకు గుర్తింపు లభిస్తున్నది. ప్రతి గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని పెంచడం, అవెన్యూ ప్లాంటేషన్ పనులు చేపట్టడం, రోడ్ల వెంట మొక్కలను నాటడం పనుల్లో పంచాయతీ కార్యదర్శులు చూపిన చొరవతో వారికి గుర్తింపు లభించింది.ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారుల పనితీరు ప్రశంసనీయంగా మారింది. గ్రామ శివార్లలో కోతుల కోసం ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టుల ఏర్పాటు వంటి పనులు వీరి పనీతీరుకు నిదర్శనంగా మారాయి.
సంక్షేమ పథకాల అమలులో కీలకం పంచాయతీ కార్యదర్శులు…
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా రకాల సంక్షేమ పథకాల అమలులో పంచాయతీ కార్యదర్శులు కీలకంగా పని చేస్తున్నారు. ప్రతి గ్రామంలో అర్హత ఉన్న వారి పింఛన్ల దరఖాస్తులను ఆన్లైన్ చేయడంతో వీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. చాలా గ్రామాల్లో ఆసరా పింఛన్లకు ఫింగర్ ప్రింట్ రాని వారి ఇంటింటికీ వెళ్లి మరీ పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలకు సబంధించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి వారికి పూర్తిగా సహకరిస్తున్నారు.
40 రకాల విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు..
ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు 40 రకాల విధులను నిర్వహిస్తున్నారు. పంచాయతీ పరిధిలో నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, ఇంటి పన్నుల వసూలు, జనన మరణాలు, మురికి కాలువల నిర్వహణ తదితర చాలా రకాల పనులను పంచాయతీ కార్యదర్శులు చేపడుతున్నారు. గ్రామాల అభివృద్ధిలో అంకితభావంతో పనిచేస్తున్న కార్యదర్శుల పనితీరును గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి వేతనాన్ని రూ.30వేలకు పెంచుతామని ప్రకటించడంతో మరింత అంకితభావంతో పనిచేస్తామని వారు పేర్కొంటున్నారు.
ఇవీ కూడా చదవండి..
దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలి