విద్యానగర్, ఏప్రిల్ 27 : రోజురోజకూ కొవిడ్ వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్తోపాటు 60 ఏండ్లు పైబడినవారికి, 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా దశల వారీగా వ్యాక్సిన్ ఇస్తున్న ప్రభుత్వం మే ఒకటో తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా వేయనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. గతంలో తలెత్తిన లోపాలను గుర్తించి వ్యాక్సినేషన్ సమయంలో అవి పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు.
కామారెడ్డి జిల్లాలో 30 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో 125 మందికి వ్యాక్సిన్ వేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. జనాలను బట్టి ప్రతి కేంద్రంలో వ్యాక్సినేషన్ పెంచుతామని వైద్యాధికారులు చెబుతున్నారు. 30 కేంద్రాల్లో 30 మంది వైద్యాధికారులు, 250 మంది ఏఎన్ఎంలు,700 మంది ఆశ వర్కర్లను నియమించారు. ప్రతి కేంద్రంలో కనీసం ఐదుగురు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి కేంద్రంలో వెయింటింగ్ రూమ్, వ్యాక్సినేషన్, పర్యవేక్షణకు మూడు గదులు ఏర్పాటు చేయనున్నారు. కరోనా పరీక్షలు చేసిన వారి పేర్లు ఐసీఎంఆర్ పోర్టల్లో నమోదు చేసినట్లుగానే టీకా వేసిన వారి పేర్లు నమోదు చేయనున్నారు. టీకా ఇచ్చిన 30 నిమిషాల పాటు వారిని పరిశీలనలో ఉంచి తరువాత బయటికి పంపిస్తారు.
ఇప్పటి వరకు 1,41,548 మందికి వ్యాక్సిన్
ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 1,41,548 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇందులో ప్రభుత్వ వైద్య సిబ్బందికి మొదటి డోస్ 3430 మందికి, రెండవ డోస్ 3081 మందికి మొత్తం 6511 మందికి టీకా వేశారు. ప్రైవేట్ వైద్య సిబ్బందికి మొదటి డోస్ 1265, రెండో డోస్ 612 మందికి మొత్తం 1877 మందికి టీకా వేశారు. ఫ్రంట్లైన్ వర్కర్లకు మొదటి డోస్ 5370, రెండో డోస్ 2492 మొత్తం 7862 మందికి టీకా వేశారు. 60 సంవత్సరాలు పైబడినవారు మొదటి డోస్ 57,092 మదికి, రెండో డోస్ 4381 మందికి.. మొత్తం 61,473 మందికి టీకా వేశారు. 45 ఏండ్లు పైబడి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు మొదటి డోస్ 60,006, రెండో డోస్ 3819 మొత్తం 63,825 మందికి వ్యాక్సిన్ వేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ యధాతథంగా కొనసాగనున్నది. ఇప్పటికే తొలి డోస్ తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సంవత్సరాలు పైబడిన వారికి రెండో డోస్ టీకా వేయడానికి ప్రాధాన్యతనిస్తారు. మే ఒకటి నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా వేయనున్నారు. సుమారు 7.5 లక్షల మందికి టీకా తీసుకోనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 75 శాతం వ్యాక్సినేషన్ పూర్తికానున్నది.
రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలా!
మే ఒకటో తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి కొవిన్ పోర్టల్ (cowin.gov.in)లో లాగిన్ అయ్యి, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. వెంటనే మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ను క్లిక్ చేయాలి. అది ఒకే అయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు ఆధార్, పేరు, పుట్టిన తేదీ వంటివి నమోదు చేసి రిజిస్ట్రేషన్ బటన్ను క్లిక్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. వాటి కోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్ను క్లిక్ చేయాలి. ఏ ప్రాంతంలో వేయించుకోవాలో అక్కడి పిన్ కోడ్ను ఎంటర్ చేసి వెతికితే దాని పరిధిలోని టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. ఒక్కసారి లాగిన్ అయితే నలుగురికి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒక వేళ సమయానికి వెళ్లలేకపోతే మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా ఆరోగ్య సేతు యాప్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. దవాఖానకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించకుండా, గుంపులు గుంపులుగా లేకుండా.. వచ్చినవారికి వచ్చినట్లు వ్యాక్సిన్ వేసి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.అంతేగాకుండా వ్యాక్సిన్ కోసం జనం ఒకే రోజు భారీగా తరలివచ్చి అక్కడ డోస్ల కొరతతో వెనుదిరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆన్లైన్లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వ్యాక్సిన్ వేయించుకునే రోజు, సమయం కేటాయిస్తారు. నిర్దేశించిన సమయంలో మనం వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.