సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది మండలంలోని పోచంపాడ్ గ్రామం. ఇక్కడ మతసామరస్యం వెల్లివిరుస్తోంది. త్రిలోక బుద్ధ విహార్, రామ మందిరం.. మసీదు.. దక్షిణ ఇండియా సంఘం చర్చి.. మహంకాళీ అమ్మాన్ ఆలయం.. ఇలా అన్ని మతాల ఆరాధనా వేదికలు ఉన్నాయి ఈ గ్రామంలో.. సిద్ధార్థ, సంఘ మిత్ర, కుంజన్, చిన్న స్వామి, ఈశ్వరన్, బసంత్ సింగ్, తిరుపాల్ సింగ్, అబ్దుల్ పాషా, మహ్మద్, శ్రీరాములు, గంగారాం, శివయ్య, జాన్ బాబు, బ్లెస్సింగ్టన్, హరి పట్నాయక్ ఇలా అన్ని మతాలు, రాష్ట్రీయుల పేర్లతో ఉన్నారు. మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఒడిశాలో వారి పూర్వీకుల మూలాలు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అన్ని మతాల సంప్రదాయాలు, సంస్కృతులు, పండుగలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇలా భిన్న, విభిన్న మతాల, ప్రాంతాల సమ్మేళనంతో విరాజిల్లుతోంది పోచంపాడ్.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని గోదావరి నది తీరాన..శ్రీ రాంసాగర్(ఎస్సారెస్పీ) ప్రాజెక్టు చెంతన ఉంది ఈ గ్రామం. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణానికి పునాది పడినప్పుడే ఇక్కడ భిన్న మతాలు, రాష్ర్టాల వారి సమ్మేళనం పురుడు పోసుకుంది. ఎస్సారెస్పీ నిర్మాణంతోపాటే ఇక్కడ సర్వ మత సామరస్యం పెనవేసుకుంటూ వచ్చింది. 1964లో ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణం పోచంపాడ్ గ్రామం వద్ద ప్రారంభమైంది.ఆ సమయంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కూలీలుగా, ఉద్యోగులుగా, కాంట్రాక్టర్లుగా, చేతి వృత్తి పని నైపుణ్యంగల వారీగా, ఇంజినీర్లుగా ఇలా రకరకాల పనులు చేయడానికి తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల నుంచి వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే సమయానికి వారు ఇక్కడి వారితో మమేకమయ్యారు. ప్రాజెక్టు ఉపాధి కల్పించిందనో.. ప్రాజెక్టు మీద మమకారమో..ఏండ్ల కొద్ది ఇక్కడి వారితో కలిసి ఉన్న బంధమో గానీ వారు తిరిగి వారి సొంత రాష్ర్టాలకు వెళ్లిపోకుండా ఇక్కడే స్థిరపడ్డారు. వీరిలో వేర్వేరు మతాల వారూ ఉన్నారు.
తమిళులు..
తమిళనాడుకు చెందిన కాంట్రాక్టరు ఏ. రాజు 1967 లో ఎస్సారెస్పీ పనుల్లో భాగంగా పోచంపాడ్ వచ్చారు. ఆయనతోపాటు వారి బంధువులు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతారు.తమిళనాడులోని కోయంబత్తూరు, సేలం జిల్లాల నుంచి వీరు వచ్చి స్థిర పడ్డారు. గ్రామంలో వారి కాలనీకి ఉన్న ముఖ ద్వార తోరణం వారి ఆవాస ప్రాంతానికి చిహ్నంగా ఉంటుంది. ఇక్కడకు రాగానే వారి దైవమైన మహంకాళీ అమ్మాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 20 ఏండ్ల క్రితమే అమ్మాన్ ఆలయాన్ని నిర్మించుకున్నారు. ప్రతి సంవత్సరం మహంకాళీ అమ్మాన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. మాలాధారణలు చేస్తారు. చెంతనే ఉన్న గోదావరి నదిలో పూజలు, పసుపు స్నానాలు, ఆల యం వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. గ్రామంలో తమిళులతో పాటు కర్ణాటక, ఒడిశా నుంచి స్థిర పడ్డ వారూ ఉన్నా రు. ఇలా వేర్వేరు మతాల వారిని, వేర్వేరు ప్రాంతాల వారిని ఒక్క దగ్గరకు చేర్చింది ఎస్సారెస్పీ. పోచంపాడ్ను సర్వమత నిలయంగా నిలిపింది. గో దారి తీరాన గంగా..జమునా.. తెహజీబ్ను ఆవిష్కరించింది. వెరసీ పోచంపాడ్ దశాబ్దాలుగా పర మత సహనానికి, అన్య మత గౌరవానికి, భిన్న ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ వస్తున్నది.
హిందూ, ముస్లిం, క్రిస్టియన్..
స్థానికులతోపాటు ఇక్కడకు వచ్చి స్థిర పడ్డ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారు. గ్రామంలో మసీదులు, దర్గాలు ఉన్నాయి. ప్రసిద్ధి పొందిన శివాలయం, రామాలయం ఉన్నాయి. శివరాత్రి, శ్రీ రామ నవమి ఉత్సవాల్లో గ్రామంలోని అన్ని మతాల వారు పాల్గొంటారు. రంజాన్, బక్రీద్ పండుగలను గ్రామస్తులందరూ జరుపుకొంటారు. గ్రామంలో ఆ రోజు మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తుంది. క్రిస్మస్ రోజుకూడా ఊరంతా పండుగ సందడి కనిపిస్తుంటుంది.
బౌద్ధులు..
పోచంపాడ్లో వందకు పైగా బౌద్ధ మతానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. వీరి పూర్వికులు, పెద్దలు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మహారాష్ట్రలోని పూర్ణ, నాందెడ్, పర్బణి, జాల్నా తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. వారి తరువాతి తరం కూడా ఇక్కడే స్థిరపడి పోయింది. వీరు బౌద్ధ మతాన్ని పాటిస్తారు. ఉత్సవాలూ జరుపుకొంటారు. పోచంపాడ్లో త్రిలోక బుద్ధ విహార్ మందిరాన్ని నిర్మించుకున్నారు. అందులో బుద్ధుడి పంచలోహ విగ్రహమూర్తి ఉంది. వారి ఉత్సవాలు, పండుగల్లో గ్రామంలోని మిగతా మతాల వారు పాల్గొంటూ ఉంటారు.
సిక్కులు
గ్రామంలో సిక్కు మత కుటుంబాలు పది వరకు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీలో పని చేశాక వరంగల్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పోచంపాడ్కు బదిలీ పై వచ్చిన సర్దార్ హరి సింగ్ ఇక్కడే స్థిరపడ్డారు. దీంతో ఆయన వారసులు, బంధువులు ఇక్కడే ఉండి పోయారు. పోచంపాడ్లో నానక్ సింగ్, గురు నాయక్, గురు గోవింద్ జయంతి తదితర ఉత్సవాలు, కార్యక్రమాలు ఘనంగా జరుపుకొంటారు.