జక్రాన్పల్లి, మార్చి 27:పల్లెప్రగతిని సద్వినియోగం చేసుకుంటూ.. మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని వివేక్నగర్ తండాను ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. జక్రాన్పల్లి గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్నప్పుడు అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగేది. ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన అనంతరం మండలంలోని ఇతర గ్రామాలతో పోటీ పడుతున్నది. ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులతో వంద శాతం అభివృద్ధి పనులను పూర్తిచేసుకొని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న ది. గ్రామంలో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. హరితహారంలో భాగంగా గ్రామంలోని నాలుగు వీధుల్లో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో తండా అంతా పచ్చదనానికి కేరాఫ్గా మారింది. తండాలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు కూడా అందుతున్నాయి.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ..
ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్తో ప్రతిరోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. డంపింగ్ యార్డుకు తరలించి అక్కడి కంపోస్ట్ షెడ్డులో ఎరువులను తయారు చేస్తున్నారు. తండాలోని డ్రైనేజీలను నిత్యం శుభ్రం చేయడంతో వ్యాధులు సైతం తగ్గాయని తండావాసులు అంటున్నారు. డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందును పిచికారీ చేయిస్తున్నారు.
తండావాసుల సహకారంతోనే..
మా తండా గ్రామ పంచాయతీగా మారిన తర్వాత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నది. తండావాసుల సహకారం కూడా ఉండడంతో అభివృద్ధి పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే పల్లెప్రగతి పనులన్నీ పూర్తి చేశాం.
-ధూళీబాయి మంగ్త్యానాయక్, సర్పంచ్, వివేక్నగర్ తండా